Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 701 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)





ఈనె కఱ్ఱపుల్ల లేమునీంద్రునిఁ గన్నఁ
బెట్టి యేమి ఫలము పిట్టతిండ్లు
ఘటశరీరు నిన్ను జటిధూర్జటీ ! కొంచు
బోనువలయుఁ దృప్తి పొందవలయు.

భక్షిత సర్వమైన తరువాతను మాంసరూపమై
కుక్షిగతంబు కొమ్ములను గ్రుమ్మునొ నాజను గొఱ్ఱెపోతు మీ
భక్షణమౌత యేమి వ్రతపారణ చేసెదు మౌనిరాజ ! నా 
యక్షియుగంబు తృప్తి గను నద్దిర ! నీవయి యారగించుచో.

పేరిమిఁ బిల్చి భోజనము పెట్టెద నన్నను బాఱిపోదు రే
లో ! రుచి లేని బక్కద్విజు లూరక యీకడ చన్ననాళ్ళ భీ
శూరుల భోజనప్రియులఁ జూచినఁ ద్వాదృశులం బ్రియంబు నా
కా రమణీయగేహ మది యద్దియె మా గృహమో వ్రతీశ్వరా

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.

బ్రహ్మదేవుని యొక్క అభ్యర్థన మేరకు అగస్త్యుడు అరణ్య మార్గంలో, వాతాపి ఇల్వలుల కోసం వెళ్ళాడు. పొట్టిగా, బొద్దుగా ఉన్న అగస్త్యుడిని ఇల్వలుడు చూసి, అతడితో విధంగా అన్నాడు.

" మునులను చూసినా, ఈనె కఱ్ఱపుల్ల ల్లాగా సన్నగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళను అతిథులుగా ఇంటికి పిలిచి భోజనం పెడితే వ్రతఫలం  ఏం దక్కుతుంది?   వాళ్ళూ వాళ్ళ పిట్ట తిండ్లూనుబొద్దుగా, కుండలాగా ఉన్న నిన్ను తీసుకుపోవాలి, మేము తృప్తి పొందాలి గానీ

తిన్న తరువాత కూడా మాoసం రూపంలో పొట్టలో ఉండి, కొమ్ములతో కుమ్ముతుందా అన్నట్లుగా ఉన్న  యీ గొఱ్ఱెపోతు మీకు వ్రతపారాయణ కోసం ఆహారం అవబోతున్నది. మునీశ్వరా ! మీరు తృప్తిగా భోజనం చేస్తుంటే, నిజంగా ఇది మాకు నేత్రానందం కలిగిస్తుంది

అరరే ! ప్రేమతో పిలిచి భోజనం పెడతామంటే పారిపోతా రేమిటి? రుచి తెలియని బక్క బ్రాహ్మణులని చూసిన చాలా రోజుల తరువాత, మీ లాంటి భయం లేని, భోజనప్రియులను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందిఇదిగో అందంగా కనపడుతున్నదే, అదే మా ఇల్లు. " 

ఇల్వలుడు మాట్లాడిన మాటలలో, బొద్దుగా, బలంగా, కుండలాగా ఉన్న అగస్త్యుడిని చంపి, ఎప్పుడెప్పుడు తినాలా అన్న ఉత్సుకత ద్యోతకమౌతున్నది. " భక్షిత సర్వమైన తరువాతను మాంసరూపమై కుక్షిగతంబు కొమ్ములను గ్రుమ్మునొ నాజను గొఱ్ఱెపోతు " అనటంలో, " నువ్వు తిన్న తరువాత కూడా, కొమ్ములతో  పొట్ట చీల్చుకొని వచ్చేటట్లున్న గొఱ్ఱెపోతు " అనే అర్థం,    " రుచి లేని బక్క ద్విజు " లనటంలో " రుచీ పచీ లేని " అన్న అర్థం  స్ఫురిస్తున్నాయి.

అయితే, " జటి ధూర్జటీ " అన్న సంబోధనలో, ఇల్వలుడు తెలియకుండానే పరమమాహేశ్వరుడైన అగస్త్యుడితో ఆటలాడుతున్నాడని ధ్వనిస్తున్నది.

పదాల్లో తెలుగుదనం ఉట్టిపడేటట్లు, సంభాషణాపూర్వకమైన కథాకథనం చేయటంలో విశ్వనాథ అందె వేసిన చేయి అనేది యీ పద్యాలు నిరూపిస్తున్నాయి.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like