Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 691 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)





నిన్నేమి చేసెదనొ కను
మన్నం బావనియు నిట్టులనియెన్ నేనే
మన్నానని కూర్చ్చుంటిని
మిన్నక యిటఁ దిరిగి తిరిగి మే నలయుటచే.

మేము శాఖామృగంబుల మేమి మాకు 
నిద్ది యూరని యుండునా యిది గృహ
టంచు నుండునా ! యెచటఁ గాయయును గసురు
దొరకు నచ్చోటఁ దిరుగుచుందుము బుభుక్ష.

 ఇంతటి రాజధాని మఱి యెవ్వరు చూడకయున్న గొప్ప యే
మంతగఁ గట్టుకో ననిన నాసుర హాస వికారరావయై
 యెంతటికోఁతి వంచుఁ బడగెత్తిన కాటుగ మోము వచ్చి కా
ప్పంతయుఁ గన్పడన్ యమునివాఁకిలి తీసినయట్లు వచ్చినన్.

ఆఁగు మటంచు నేటి కది యంతటి ధూర్తత నేను వట్టి యూ
రేగెదఁ జూచివత్తు నిట నెవ్వరి నేమియుఁ జేయనం చనన్ 
వే గురువెట్టి దానవియు బిట్టుగఁ దా నరచేతవ్రేసెఁ దీ
వ్రాగసురాలు దాని కతఁడై యణఁగారునటంచు నెంచుచున్.

  క్షితితలంబున నుండి లేచిన మహాశ
ని ప్రరోహంబుగాఁ బావనియును లేచి
యసురిమొగమున నఱచేత నప్పళించె
నసురి మొగమున నిరుచేత నదుముకొనియె

లంకిణి హనుమల మధ్య సంభాషణలతో కూడిన పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.  

విశ్వనాథ కవితా వైదుష్య మేమంటే, అవి గీతపద్యాలైనా, వృత్తాలైనా, కందాలైనా, ఇతరులకు  అంత తొందరగా కొరుకుడుపడని మధ్యాక్కరలైనా, అలవికాని ఛందోవృత్తులైనా, వారి చేతిలో అందంగా ఒదిగిపోతాయి

లంకా పట్టణంలో ప్రథమ ప్రవేశద్వారం దగ్గర కాపలా కాస్తున్న లంకిణి హనుమను చూసి హుంకరించింది. లంకిణి గద్దింపు మాటలు వినపడగానే దేహాన్ని పెంచిన హనుమను " టక్కరికోతి " వని నిందించింది. వారిద్దరి మధ్య రమ్యంగా సాగిన సంభాషణే పద్యాల లోని భావం.

" ' నిన్నేం చేస్తానో చూడు ! '  అని లంకిణి అనగానే, వాయునందనుడు, ' నిన్నేమన్నానని. అటూ ఇటూ తిరిగి వచ్చి, అలసిపోయి, చప్పుడు చేయకుండా కూర్చున్నాను

మేము చెట్లకొమ్మల మీద గెంతుతూ తిరిగే వాళ్ళం. మా కేమన్నా ఒక్క ఊరని గానీ ఒక్క ఇల్లని గానీ ఉంటుందా? ఎక్కడ కాయ కసరు దొరుకుతాయో, ఆకలిని తీర్చుకోవటానికి అక్కడల్లా తిరుగుతుంటాము

ఇంత పెద్ద రాజధానిని, పెద్ద నగరాన్ని కట్టుకొని, మరి ఎవరూ చూడకూడదనుకుంటే, అది ఏమంత గొప్పతనం? " మాటలు వినగానే రక్కసి వికృతంగా నవ్వి, " అరే ! ఎంతటి కోతివి? ' అంటూ, పడగను పైకెత్తి కోరలు చాచిన మహాసర్పం లాగా, యమపురి ముఖద్వారం తెరిచినట్లుగా, తన పెద్ద నోటిని తెరిచింది

ఇదంతా విన్న హనుమ, ' ఆగమంటూ ఎందుకంత దురుసుతనం చూపిస్తావు? నేను ఊరకే ఊళ్ళో తిరిగివస్తా. ఎవ్వరినీ నేను ఏమీ చెయ్యను. "  అన్నాడు మాటలు వినగానే, రాక్షసి గద్దించి, అణగిపోయేటట్లుగా, హనుమను అరచేతితో గట్టిగా చరిచిందిపవమానసుతుడు కూడా, నేలపై నుండి ఒక్కసారిగా లేచి, పిడుగు పడవేసినట్లుగా అరచేతితో లంకిణి ముఖం మీద మొత్తాడు. దానితో రక్కసి రెండు చేతులతో ముఖాన్ని అదుముకొంది. "

విశ్వనాథ సన్నివేశాన్ని సంభాషణాపూర్వకంగా వర్ణించిన తీరు పాఠకుని మనస్సును  హత్తుకొంటుంది












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like