Monday 10 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 714 (కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ: పురాణవైర గ్రంథమాల:1)





ఒకనాటి ప్రొద్దున సూర్యోదయమైనదిఉదయాంభోజాత బంధు మందారకుసుమ సందోహారుణకిరణ oతానతంతన్యమాన ధారుణీరుహ కిసలయ చ్ఛవిచ్ఛటా పరిదీప్తమైన యా ప్రదేశము నాకబలి మ్రుగ్గులు పెట్టినట్లుండెనుఅవియొక వింత వెలుగులు ప్రసాదించినవిప్రాతఃకాల సమాయాత మందానిల సుందర తరంగ డోలికాకలిత క్రీడావిలాస పేశలములయిన ప్రాతర్వికసితకుసుమములు శిశువుల వలె సుందర మందహాస ప్రదర్శితపరిమిత దంతకాంతి  ప్రరోహమధుర హేలానిదానములుగా కనిపించుచుండెను. సద్యోవికసిత పద్మ్మశేఖరద్వార నిర్వియాసు మధుకర శిరోదర్శనము చేత చూచుకముతోడి ముక్తకంచుకయైన ప్రౌఢయువతి పరమ రమణీయ వక్షోమండలము వలె సరోవరైక దేశములు భాసించుచుండెను. తద్గతోషఃకాల పతిత హిమకణ చారుశేఖరములయిన ఘాసాగ్రము లరుణ సూర్య కిరణ చ్ఛటాసoదీప్తములై శత్రుని పొడిచి, తడిసిన బాకు తుది కల రక్తబిందువుల వలె భాసించుచుండెను. కొన్ని కోడెదూడలు మోరలువంచి తోకనెత్తుకొని నాల్గు కాళ్ళు కలిపి దూకగల్గుట  యభ్యాసము చేయుచుండుటను విడంబించుచుండెను. యెగురుచున్న దూడల వంక తల్లులు ముట్టెలు వానివైపునకు త్రిప్పి, యప్పుడే పగిలి  దూది కనిపించు పచ్చి ప్రత్తికాయలవంటి కనులతో, తదేక ధ్యానవివశములై యుండెను. మూడు పాలదుత్తలు చేతబూని గోపాలకులు యితస్తతః ప్రచార పరిరమ్య మూర్తులు నెడమ చేతులలో బందపుత్రాళ్ళు కలవారు థెయ్, థెయ్ - అనుచుండిన యావులమందను వదలి మెడపలుపుల మొరపిడికి గొంతులు తెగిపోవునో యన్నంత బిఱ్ఱుగాలాగికొను నాదూడల సడలించుట  బెట్టిదమయి, కూర్చుండి దూడలను బుజములతో కట్టు కొయ్యలవైపు త్రోయుచు వాని త్రొక్కిడి వలన తొలుత తీసిన పాలదుత్త కొంచె మొడ్డిగిలగా మరల పలుపుముడి యూడదీయ ప్రయత్నించుచుండిరిఇంతలో వాని తల్లులు తమ జీవితపరమార్థమంతయు వానికి పాలిచ్చుటే యన్నట్లు తత్పరమార్థ ప్రతీక్షా పరమములయిన నేత్రములతో నిలబడి యుండెనుదూడలు పొదుగులలో ముట్టెల పెట్టి రెండుక్రుమ్ములు క్రుమ్మెనో లేదో గోవులంతలో కుండోధ్నులయ్యెను. బిడ్డల కోసము గోవు చేపిన వేళ నామె శరీరమునందలి పశ్చాద్భాగము వేల్పువీటి యమృతపు బావి ప్రక్కన సర్వజనపిపాసాపనయన దోహలమయిన చలువఱాతికుండలవలె నుండెను. క్రమక్రమముగా సూర్యకిరణారుణ కాంతులు వళక్ష చ్ఛాయలుగా విఱుగజొచ్చెను


- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ: పురాణవైర గ్రంథమాల:1

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like