Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 698 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము : సంశయ ఖండము)





నలినకాంతాసమానత గండభాగానఁ జిటిక వేసెనొ నవ్వు చెఱగిపోసె
ముద్ద మందారమ్ము బుగ్గపై నొక్కెనో కమిలిపోయినయట్లు కందిపోయె
లలిఁబారిజాతమ్ము గిలిగింత పెట్టెనో తూఁగాడు కొమ్మనే తూలిపోయె
రాదంచు  మోటు పరాచికమాడెనో ముగుద కల్వయు మోము ముడుచు కొనియె

రుద్రజట ముక్త కంచుకా రూఢమయ్యె
చంద్రకాంతమ్ము చిఱునవ్వు సంతరించె
నొక్కఁడొకఁడు స్వభావంబు పిక్కటిల్ల
నబ్జబంధుని బానిసలైన పూలు.

ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది.

ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశబద్ధులను చేశాడుఅశేష వానరసెన చింతాక్రాంతమయింది. కొన్ని కోతులు, లోపలి గుజ్జు తెల్లగా కనపడేటట్లు మిగలబండిన సీతాఫలపు పండ్లలాగా, పళ్ళను బైటకు పెట్టి, చేతులలో చెక్కిళ్ళ నానించి, గొంతుకు కూర్చొని, చూస్తున్నారుసీతాదేవి కూడా రామలక్ష్మణులకు ఆపద రాకుమండా చేస్తే అగ్నిప్రవేశం చేస్తానని మ్రొక్కుకుంది. ఇంతలో, విషయం తెలుసుకొన్న గరుత్మంతుడు అక్కడకు వచ్చి రామలక్ష్మణులను నాగపాశ విముక్తులను చేసి వెళ్ళిపోయాడుక్రమ క్రమంగా రామచంద్రుడు, లక్ష్మణుడు స్పృహలోకి వచ్చారురామచంద్రుడు నిల్చుండి అల్లెత్రాటిని మ్రోయించాడువానరసేన ఒక్కసారిగా పులకాంకితమై పోయిందిఒక్క వానరసేన మాత్రమే కాదు, ప్రకృతి మొత్తం పులకించిపోయింది.   ఇంతలో సూర్యభగవానుని  అరుణారుణ కిరణాలు మెల్ల మెల్లగా పుడమితల్లిని తాకడం మొదలుపెట్టాయి. సూర్యోదయ వర్ణనమే పద్యం లోని భావం

" చెక్కిలిపై చిటిక వేస్తే కందిపోయినట్లుగా, తామరపువ్వు అనే కాంత నవ్వులు చెరిగిపోసిందిబుగ్గపై నొక్కారా అన్నట్లుగా, ముద్దమందారం కమిలిపోయింది. అతి సుకుమారమైన పారిజాత పుష్పం, ఎవరో గిలిగింత పెట్టినట్లుగా, ఊగుతున్న కొమ్మకే వాలిపోయిందిరానని మోటు సరసమాడినట్లుగా, ముగ్ధ వంటి కలువకన్నె ముడుచుకుపోయిందిరుద్రజట రవిక విప్పుకొన్నట్లుగా పూరేకులను విప్పుకొంది. చంద్రకాంత పుష్పం చిరునవ్వు లొలుకపోసిందిపద్మబాంధవుని బానిసలైన పూలు ఒక్కొక్కటి  తమ స్వభావానికి అనుగుణంగా వికసించటం మొదలుపెట్టాయి. "

శ్రీరాముడు అవతార పురుషుడుశ్రీ మహావిష్ణువు అవతారంసూర్యమండలాంతర్వర్తి. సూర్యుల కెల్ల సూర్యుడుఅందువలన, నాగపాశం నుండి విముక్తులైన రామలక్ష్మణులను చూసి ప్రకృతి మొత్తం పులకించిపోయింది

సందర్భానికి తగ్గట్లుగా వర్ణనలు చేయటంలో విశ్వనాథ అందెవేసిన చేయి. లక్షణం శ్రీమద్రామాయణ కల్పవృక్షము కావ్యమంతా పరచుకొని ఉంది.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like