Friday 21 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 734 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)





కృసరమొసంగు నట్టి రురు వియ్యది పెంటిని బాసి మిక్కిలిన్ 
వ్యసనమునంది నా దెసకు నైనది, దీనిని గూడ నగ్నితో
సరిగఁ జూచెదన్, మృదుకడారము వన్నె నెసంగు దాని దృ
క్ప్రసరము జాలిగొల్పు, ప్రియభార్య వియోగము పుక్కిలింతలై.

పృథు పితృవాక్ప్రియాచరణ విశ్రుతధర్ముడ వీవునున్ మహా
రథుడవు మాననీయుడవు రాజవు సర్వధరిత్రికిన్ బ్రియా
తిథి వరుదెంచినా వనుమతింపుము మత్కృత మర్ఘ్యపాద్యముల్ 
పృథుల వనాంతవాసమున నెప్పుడు వచ్చెదవంచు జూచెదన్.

సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వచ్చారుమహర్షి వారిని అగ్నిగృహానికి తీసుకువెళ్ళాడుఅగ్నిగృహమంతా హరిణ సంచారంగా ఉందిఅగస్త్యుడు బ్రహ్మ స్థానంలో బలులు సమర్పిస్తుండగా, ఆయన శిష్యులు, అన్ని అగ్ని స్థానాలలోను బలులు సమర్పిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నంతసేపు తననే చూస్తూ అగ్నిగృహంలో ఒక మూల పడుకొని ఉన్న దుప్పికి, అగస్త్య మహర్షి యజ్ఞార్థం ఉపయోగించిన కృసరం (నువ్వులు, బెల్లం) తినిపించాడు. తరువాత సుఖాసీనుడైన మహర్షికి, ముగ్గురూ సాష్టాంగ దండప్రణామాలు గావించారు. అప్పుడు మహర్షి వారితో ఇలా అన్నాడు

" ఇప్పుడు కృసరం (యజ్ఞార్థం వాడిన నువ్వులు, బెల్లం) తిన్నటువంటి యీ దుప్పి, తన తోటి ఆడుదుప్పికి దూరమైనటువంటిది. మిక్కిలి దైన్యస్థితిలో నా ఆశ్రమానికి వచ్చింది. నేను దీనిని  అగ్నితో సమానంగా చూస్తానుప్రియమైన భార్యా వియోగంతో బాధపడుతున్న గోరోజనం రంగులో ఉన్నటువంటి యీ  దుప్పిని చూస్తే నాకు చాలా  జాలి వేస్తుంది

రామచంద్రా ! నీవు పితృవాక్యపరిపాలన అనే మహాధర్మాన్ని చాలా ఇష్టంగా ఆచరిస్తున్న అచంచలమైన దీక్షాపరుడివి, మహాపరాక్రమశాలివి, గౌరవనీయుడివి,సర్వ భూమండలానికి రాజువిఇప్పుడు నా ఆశ్రమానికి అత్యంత ప్రియమైన అతిథిగా వచ్చావుఅందువల్ల, నేనిచ్చే అర్ఘ్యపాద్యాదులను స్వీకరించు. గురుతరమైనటువంటి వనవాసాన్ని ముగించుకొని మరల నా ఆశ్రమానికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. " 

ఋషులు త్రికాలవేదులుజరగబోయే సంఘటనలన్నీ వారి దృష్టిగోచరాలే. అగస్త్యుడు చెప్పిన దుప్పి వృత్తాంతం జరగబోయే సీతారాముల వియోగాన్ని సూచిస్తున్నది. ఇక దుప్పి తనకు అగ్నితో సమాన మనటంలో, అవతారమూర్తియైన రాముడు తనకు ఆరాధనీయుడన్న అర్థాన్ని స్ఫురింపజేస్తున్నది.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like