Wednesday 19 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 729 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)




మనమున్ వారి విధాన నుంటిమికదా మాటాడి యూహించి ధీ
ఘనమౌ మానవవృత్తమున్ నడిపి శాఖావృత్తమొక్కండు
ల్గిన దోసాన మృగాలమౌదుమె శరక్రీడాసమారూఢ దు
ర్జనరేఖావ్యసనుండుకాక హితకార్యక్లేశవృత్తుండునై.

నీవు కులాచలేంద్ర సమ నిశ్చలదేహబలుండ వద్రి నీ
పై విసరన్ మఱిం గదలఁబాఱవు తాదృశుఁడయ్యుఁ గూడ నో
హో వెస సప్తదాళదళనోగ్రము బాణము నెంచ గుండెలో
నావులు తేరు నిల్వగలవా ! రఘురాముని యంపఱివ్వునన్.


నీవే యుద్ధము చేయబోయినను గానీ నేను భీతిల్ల సు
గ్రీవుల్ వందలు వచ్చినన్ భయపడన్ శ్రీరాముఁడచ్చోట నే
దో వృక్షంబును జాటు చేసికొని దూయున్ బాణ మేవేళనో

యా వేళన్నినుఁగాచుకోఁగలుగు నూహంజేయలేనయ్యెదన్.

తార సుగ్రీవుడితో యుద్ధానికి సన్నద్ధమౌతున్న  వాలిని వారించి, అతడికి హితోపదేశం చేస్తున్నది.

" మనం కూడా మానవుల లాగానే ఉన్నాము కదా ! వారి వలే మాట్లాడగలుగుతూ, ఆలోచించ గలుగుతూ, గొప్ప బుద్ధిబలాన్ని ప్రదర్శిస్తూ, చెట్లమీద నివసించేవారం అన్న ఒక్క దోషం చేత, జంతువుల మౌతామా? రాముడు తన చాపవిద్యను ప్రదర్శించాలనే దుర్వ్యాసంగం చేత నిన్ను చంప నెంచటం లేదు. హితుని యొక్క పనిని చేసిపెట్టటమనే గురుతర బాధ్యత మీదవేసుకొన్నాడు.

నీవు కులపర్వతమంత దేహబల మున్నవాడివిపర్వతాన్ని నీ పైన విసిరినా, నీవు కొంచెమైనా చలించవు. అటువంటివాడివైనా కూడా, ఏడు తాటిచెట్లను కూకటివ్రేళ్ళతో పెకలించిన భయంకరమైన బాణం నీ గుండెను దహిస్తే, రఘురాముని యొక్క శరతీవ్రతను నీవు తట్టుకోగలవా?

నీవు యుద్ధానికి వెళ్ళినా  నేను భీతిల్లలేదువందమంది సుగ్రీవులొచ్చినా భయపడనుకానీ, రాముడు ఏదో ఒక  చెట్టును చాటుగా చేసుకొని, ఏదో ఒక  సమయంలో బాణం వేస్తాడు. మరి అటువంటి సమయంలో నిన్ను నీవు రకంగా రక్షించుకొంటావో ఊహించుకోవటానికి కూడా కష్టంగా ఉంది. "

తార మాట్లాడిన తీరు చూస్తే, ఒక వైపు వాలిని గూర్చి ఆందోళన, ఇంకొక వైపు శ్రీరాముని యొక్క అతిలోక సామర్థ్యాన్ని తన భర్త గ్రహించటం లేదన్న ఆవేదన ద్యోతకమౌతున్నాయి. తాము కేవలం శాఖామృగాలము కాదన్న విచక్షణలోరాముడు చేయబోయే పని ధర్మ విరుద్ధం కాబోదన్న హెచ్చరిక కూడా దాగి ఉంది.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like