Friday 14 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 726 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతార ఖండము)




సర్వదుఃఖహరమ్ము కౌసల్య పూర్వ
జన్మసంస్కృతి యోంకార సదృశమైన
తతమధురరామనామమ్ము ధాన్యలక్ష్మి
యపహతనిచోళమగు నెదఁ హత్తుకొనియె.

వెలికిఁ గొనిపోకుడీబిడ్డఁ బిట్టలారు
సంజవేళల నంచుఁ గౌసల్య పలుకు 
గరుడి వైకుంఠమున భయకంపితుండు
మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు.

బోర్లగిలఁ బడనేర్చిన భూపుసుతులు
తలయుఁ గాల్సేతులిట్టె కదల్చుచుండ
నీళ్ళుత్రవ్వుక చన్న తాబేళ్ళపోల్కి
శాంతకొడుకమ్మతోఁ గేకిసలుగఁ జెప్పు.

రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతు
లొత్తి చూచును బూరుషు లెత్తికొనిన
లక్ష్మణుడు ముక్కులును జెవుల్ తడిమి చూచు
నెవ్వరే నంగనలు దన్ను నెత్తికొనిన.

బిడ్డలు పుట్టిన పదకొండో రోజున, వశిష్ఠ మహర్షి, ఋష్యశృంగమౌని, దశరథ పుత్రులకు నామకరణం చేస్తున్నారు. మహోత్సవాన్ని చూడటానికి అయోధ్యా నగరం లోని ప్రజలు విరగబడి వచ్చారు. పుణ్యాహవాచనం అయిన తరువాత, పళ్ళెం నిండా బియ్యం పోయించి, పెద్దవాడైన కౌసల్య కొడుకు పేరు అనేటంతలో, మహారాజు బియ్యం పైన రత్నపుటుంగరంతో ' రామ ' అని వ్రాసి, చంద్రుడని వ్రాయకముందే:

" కౌసల్య యొక్క పూర్వజన్మ సంస్కార ఫలితమైనట్టి, ఓంకారంతో సమానమైనట్టి, సమస్త పాపాలను పోగొట్టేటటువంటి, తియ్యనైనరామ ' అనే పేరుని పొట్టు ఒలవబడినట్టి ధాన్యలక్ష్మి తన గుండెకు హత్తుకొన్నది. "

బిడ్డలకు నెలలు నిండుతున్నాయి. ఉయ్యాలలో పడుకోబెట్టిన పిల్లలను చూడటానికి అయోధ్యానగరం లోని జనం వస్తున్నారు

" సాయంత్రం పూట, చల్లగాలి కోసం రాముడిని బయటకు తీసుకుపోబోతుండగా, కౌసల్య చూసి, పిట్టలారే వేళ బిడ్డను బయటకు తీసుకు వెళ్ళవద్దన్నది. మాట వినగానే, వైకుంఠం లోని గరుత్మంతుడు భయంతో రెక్కలు ముడుచుకొన్నాడు. " 

బోర్లగిల పడటం నేర్చుకొన్న రాజకుమారులు కాళ్ళూ చేతులూ అటూ ఇటూ కదిలిస్తుంటే, నీళ్ళలో తవ్వుకుపోతున్న తాబేళ్ళలాగా ఉన్నారని శాంత కొడుకు వాళ్ళమ్మతో కిలా కిలా నవ్వుతూ చెప్పాడు.

తన నెత్తుకొన్న మగవాళ్ళ తలలపై చేతులు పెట్టి , రాముడు ఒత్తి చూస్తుంటే, తన నెత్తికొన్న  ఆడవాళ్ళ ముక్కుచెవులను తడిమి చూస్తున్నాడు లక్ష్మణుడు. " 

శ్రీరాముడు ఓంకారరూపుడైన శ్రీ మహావిష్ణువు అవతారం. అటువంటి వానిని కన్న కౌసల్యది బహుజన్మగత సంస్కార విశేషం. అందుచేతనే, రామనామం బియ్యంపైన వ్రాయబడగానే ధాన్యలక్షి యెడద పులకించిపోయింది. " ధాన్యలక్ష్మి అపహత నిచోళమగు నెద హత్తుకొనియె ". పొట్టు వలవబడిన ధాన్యం, సంపదల నిచ్చే ధాన్యలక్ష్మితో పోల్చబడిందినిచోళము అంటే పయ్యెద. పయ్యెద తొలగిన గుండెకు ధాన్యలక్ష్మి హత్తుకొంది. లక్ష్మీనారాయణులది అవిభాజ్యమైన యుగాలనాటి సంబంధం కదా !

బోర్లగిల పడిన పిల్లలు నీళ్ళలో త్రవ్వుకుపోతున్న తాబేళ్ళ వలె ఉన్నారనటం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆదికూర్మావతారాన్ని స్ఫురణకు 

సాయంత్రం సమయంలో పక్షులు గూళ్ళకు తిరిగి వెళ్తాయి సమయంలో, పిట్టలు ముక్కున కరచుకొన్న పుల్లాపుడకా, పురుగులు మొదలైనవి పిల్లల మీద పడితే అపాయమని, పిల్లలను బయటకు తీసుకువెళ్ళద్దంటారు. దానిని పిట్టలారే వేళ అని పిలవటం తెలుగువారికి అలవాటు. కౌసల్య మాట అనగానే, పక్షిరాజైన గరుత్మంతుడు రెక్కలు ముడుచుకొనటం ఒక అందమైన కల్పన.

రాముని అవతార లక్ష్యం దశకంఠుని సం హారం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోసాడనటం సర్వవిదితం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడిని నిజం చేస్తూ, శిశువులైన రామలక్ష్మణులు తమ లక్ష్యార్థం కోసం ఎదురుచూస్తున్నారని కల్పన చేయటం విశ్వనాథకే సాధ్యం.

కల్పవృక్షావతారికలో విశ్వనాథ " మదికి నుదాత్త కల్పనల మక్కువ గల్గిన విశ్వనాథ శారద, బహుళార్థదాయిని  సురద్రువు రామకథన్ భజింపుమీ ! " అన్నారు. రామాయణ కల్పవృక్షము కల్పనలనే పరిమళభరిత మంజుల కుసుమాల నందించే కల్పవృక్షమే.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనివి.











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like