Wednesday 5 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 689 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)





అల త్రిశూలసుదర్శనంబులు పినాక
శార్ఙములు లేని యా నీరజాతభవుడు
స్వాభిమతకర్మ శాపాయుధాయుధుండు
తన మహాయుధరాజంబు దరిసియనియె

పరమ మాహేశ్వరుండవు పరమవైష్ణ
వుండవు నగస్త్య ! నీ కనుబొమలు రెండు
శార్ఙము పినాకమును దపసంభృతాత్మ
చటుల మామక శాసనశక్తి వీవు.

బలి తలమీఁదఁ జిన్ని హరిపాదపు గుర్తులు వింధ్యపర్వతో
పల శిఖరాన నీదుముని పాదపుగుర్తులు రెండునున్ జగ
త్ప్రళయ నివారకాభయ నిదాన నికేతన మోహనాంశులై
వెలిగెడు  సాధు సౌరపదవీ నదవీయసమైన సత్కృపన్.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని యీ పద్యాలు సప్తఋషుల్లో మేటి అయిన అగస్త్యుని గురించి బ్రహ్మ చెప్పిన మాటలను తెలియజేసేవి.

" అటు త్రిశూలం సుదర్శనం గానీ, ఇటు పినాకం శార్ఙం గానీ లేనటువంటి పద్మసంభవుడు, తాము చేసిన కర్మలనే శాపములనే ఆయుధములుగా మలచేటటువంటివాడు, అయిన బ్రహ్మదేవుడుతన గొప్ప ఆయుధం అగస్త్యుడిని చూసి ఇలా అన్నాడు.

" అగస్త్యా ! నీవు పరమ శైవాచారపరుడివి, అలాగే పరమ వైష్ణవుడివి కూడానునీ రెండు కనుబొమలలో, ఒకటి శార్ఙము, రెండవది పినాకము. మహాతపశ్శక్తి సంపన్నుడవైన నీవు నా యొక్క శాసనశక్తివి

బలి చక్రవర్తి తల మీద వామనుడు పెట్టినటువంటి పాదపు గుర్తులు, వింధ్యపర్వతం గర్వాన్ని అణచటానికి మునీశ్వరుడివైన నీవు పెట్టిన పాదపుగుర్తులు, జగత్ప్రళయాన్ని నివారిస్తూ, అభయాన్ని ప్రసాదిస్తూ, ఉజ్జ్వలంగా ప్రకాశించే నివాసాలునీ దయ వలన సజ్జనులు, దేవతలు సుఖంగా ఉంటారు. "

అగస్త్యుడు సప్తఋషుల్లో అగ్రగణ్యుడు. ఆయన తపస్సు వెచ్చించి చేసే పనులన్నీ జగత్కళ్యాణకారకాలేఆయన పరమ మాహేశ్వరుడు, పరమ వైష్ణవుడు కూడానుశాపాన్ని ఆయుధాలుగా కలిగిన ఆయన కనుబొమలు ఒకటి శ్రీమహావిష్ణువు యొక్క ధనుస్సు శార్ఙము, రెండవది శివుని విల్లు పినాకము వంటివి. విష్ణువు, శివుడు, వీరిద్దరే జగత్తుకు ప్రభువులు. జగత్కళ్యాణకారకులు. అటువంటి వాడే అగస్త్యుడు అని బ్రహ్మ భావన

మొదటి పద్యంలో ' త్రిశూల సుదర్శనంబులు, పినాక శార్ఙములు ' అని శివుని యొక్క, విష్ణువు యొక్క ఆయుధాలను ఒక క్రమంలో చెప్పిన బ్రహ్మ (కావ్యానేక బ్రహ్మాండ స్రష్ట విశ్వనాథ), క్రమాన్ని మార్చి " పరమ మాహేశ్వరుండవు పరమ వైష్ణవుండవు నగస్త్య ! నీ కనుబొమలు రెండు శార్ఙము పినాకమును " అని చెప్పాడుఅందుచేత, త్రిమూర్తులలో ఒకడైన చతుర్ముఖబ్రహ్మకు గానీ, విశ్వనాథకు గానీ, శివకేశవుల యెడల భేదము లేదు.  

శ్రీమద్రామాయణ కల్పవృక్షము ద్వైతాద్వైత మార్గాల్లో రచింపబడిన మహాకావ్యం.








No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like