Tuesday 22 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 777 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము:కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము) 1.గోరంటం బొనరింపనైన పనియున్ గొడ్డంట దీర్పంగనున్ / నేరంగల్గుటయే విచిత్రమగు నీ నీచంబు కార్యంబు నీ / వారంభించుట యిద్ది యిట్లనుచు నీకా చెప్పువారుండిరే / వారిం గూరిచి చెప్పగావలయుఁ దద్వైదగ్ధ్య సంభారముల్. / 2.కోమలమూర్తి నిన్ను గని కోపము వచ్చుట లేదుగాని నీ / యీ మలినంపుఁ గార్యమున కేమియుఁ జేసినఁ జేయవచ్చు ని / న్నా మెయినన్నెదిర్చి రణమాడవుగాని రణంబు లోపలన్ నీ / మృదుదేహమున్ మెదిపి నిర్మథనం బొనరించియుండనే. / 3.ఔరా ! యా యిక్ష్వాకువు / నా రఘువును నా దిలీపుడా దశరథుడు / వారల ప్రతిష్ఠ యేమిటి / వీరుడ వీ చెట్టుచాటు వెలిపని యేమీ? / 4.మా మాంసము తినియెదరో / మీ మానవులయిన పతులు మేము నభక్ష్యం / బౌ మృగపంచకమందు / న్నామయ్యా ! రామ ! పంచనఖములయందున్. / రామబాణంతో నేలగూలిన వాలి రాముడికి ప్రశ్నలను సంధించాడు. " రామా ! అసలు నువ్వు గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగించటమే చిత్రంగా ఉంది. ఈ నీచమైన పనిని నువ్వు ఆరంభించటం, ఇది ఇట్లా చెయ్యమని నీకు చెప్పారే, వాళ్ళను గురించి, వాళ్ళ నేర్పరితనం గురించి చెప్పుకోవాలయ్యా ! కోమలమూర్తివైన నిన్ను చూస్తే కోపం రావటం లేదు గాని, నువ్వు చేసిన యీ పాపకార్యానికి మాత్రం నిన్నేం చేసినా చేయవచ్చయ్యా ! నువ్వు నాతో ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు గాని, ఆ రకంగా చేసి ఉంటే, నీ దేహాన్ని మెదిపి ముద్దగా చేసి ఉండేవాడిని. అయ్యో ! ఆ ఇక్ష్వాకువు, రఘుమహారాజు, దిలీపుడు, దశరథుడు వంటి వారి కీర్తిప్రతిష్ఠ లేమిటి, మహావీరుడివి నువ్వు చెట్టుచాటు నుంచి చేసిన నీతిబాహ్యమైన పని యేమిటి? పోనీ, నా మాంసం కోసమని నన్ను చంపావా అంటే, మానవులు తిననటువంటి, ఐదు గోళ్ళు కలిగిన జంతుజాతికి చెందిన వాడిని నేను. " వాలి వధను గూర్చి సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి. వాటన్నిటికీ, రాముడు దగ్గర నుంచే సమాధానాలు లభిస్తాయి. తమ్ముడి భార్యను బలవంతంగా గ్రహించినటువంటి అనాగరకపు చర్యకు పాల్పడినా, మర్యాదారాముడు వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు సహేతుకమైన జవాబులు ఇస్తాడు. అధర్మవర్తనానికి పాల్పడిన వాలి, ధర్మమూర్తులైన ఇక్ష్వాకువు, రఘువు, దిలీపుడు, దశరథులను ప్రస్తావించటం, చావబోతున్న సమయంలో కూడా ఇంకా అతనిలో చావని అహంకారాన్ని తెలియజేస్తుంది. ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like