Wednesday 9 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 754 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)




కొందఱు మృణ్మయాకృతులు కొందఱు భావమయాకృతుల్ పరి
స్పందిత జీవలక్షణమె వచ్చి శరీరము తాల్చి పొల్చెడున్ 
గొందఱ వాఱి జూచుటయె గుర్తును పట్టుట వారి సద్గుణా
ళిం దనివొందు భావ విమలీకృత చిత్తముతోడఁ బోల్చినన్.

గుణవిభావనాత్తాకృతి క్షోణిజాత
మనసులోన నవ్యక్తమై మలయుచుండె
నట్టి యవ్యక్తరూపంబు వ్యక్తరూప
ముగను జేయగఁ బటురూక్షముగఁ దలంచి

కనులుమూసి యెడమకంటి ముందర రామ
భద్రు నిలిపి యతని ప్రక్క దేవి
  రూప మెంచుచుండ రూక్ష రూక్షంబుగ 
నొక మెఱపు మెఱసె నూర్జితముగ.

తామరపూవుపై సిత సితచ్ఛవు లూరుచు నున్నయట్లు సౌ
దామని నిల్చియున్నటుల దామరసేక్షణ కోమలార్ద్రభా
వామృత మందహాసరుచిరానన చేతను తెల్ల తెల్లనౌ 
తామరపూవు విచ్చినది తాలిచి తేనియ పచ్చిరేకులన్.

అంతలోన దేవి యంతర్హితంబైన
నిలిచి రామమూర్తి నీరజాక్షుఁ
డంత హనుమ యెఱిగె నాత్మలోపలి తన
రామమూర్తికాడు రామమూర్తి.

ఇదివఱకే యెఱింగినదె యీ మహనీయతరార్థ మైహికా
స్పదమగు కార్యమందున బొసంగదు దైవికమైన యత్న మీ
పదమున నద్దిగాక తన భావము మానసికంబు కాక మో
 క్షదము నుపాసనా విషయి గావున భేదముకల్గె మూర్తిలో.

హనుమ లంకానగరంలో సీతాన్వేషణ సాగిస్తున్నాడుఅమ్మను గుర్తుపట్టాడమెలాగా, ఇంతకు ముందెన్నడూ చూడని తల్లి రూపురేఖ లెలా  ఉంటాయా అని ఊహిస్తున్నాడుతన మనస్సులో పలు విధాలుగా తలపోస్తున్నాడు.

" లోకంలో కొందరు భౌతికజీవులుంటారు. వారు అన్నమయశరీరులు. కొందరు మనోమయజీవులువారు ఎల్లప్పుడూ వారి భావాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. జీవలక్షణమే రూపు దాల్చి వచ్చిందా అన్నట్లు కనపడతారు. కొందరిని చూడటమంటేనే వారిని గుర్తుపట్టడం. ఎక్కడో చూసినట్లనిపిస్తుందివారి గుణగణాలను అంచనా వేసుకోగలుగుతామువారి సద్గుణాలు మనను ఆకట్టుకొంటాయి కనుక వారి భావాలు కూడా విమలంగా, మనోజ్ఞంగా ఉంటాయి.  

అటువంటి సద్గుణరాశి సీత. అందువల్ల నా మనస్సులో తెలియకుండానే ఆమె రూపం మెదులుతూ ఉందిఅటువంటి అవ్యక్త రూపాన్ని వ్యక్త పరచుకోవాలంటే గాఢమైన భావన చేయాలి.

విధంగా తలపోసి, హనుమ కనులు మూసుకొని, ఎడమకంటి ముందర రామచంద్రమూర్తిని నిలిపి, ప్రక్కనే అమ్మవారి రూపాన్ని తలచుకొంటుండగా, అద్భుతంగా ఒక్క మెరుపు మెరిసినట్లుగా అయింది.

తామరపూవు మీద తెలతెల్లగా కాంతి బహిర్గతమౌతున్నట్లుగా, పద్మాల వంటి విశాలమైన నేత్రాలతో, మంజులమైన భావామృతాన్ని చిలికిస్తూ, మందహాస ముఖారవిదంతో , చేతిలో, తేనెలను కుమ్మరిస్తున్న పచ్చిరేకుల తెల్ల తామరపువ్వును పట్టుకొనిన ఒక దేవతామూర్తి తన కనుల యెదుట నిల్చొని ఉన్నట్లుగా హనుమకు కనిపించింది.

అంతలోనే దేవి అంతర్థానమై, ఎదురుగా నీరజాక్షుడు రామచంద్రమూర్తి నిల్చొని ఉన్నాడుకానీ, నిల్చున్న రామమూర్తి, తన ఆత్మలో నిలిపుకొన్న రామమూర్తి కాడని అనిపించింది.

తన ఆత్మ లోపల తానెరిగిన రామమూర్తి ఐహికపైన పనులలో పొసగే రూపం కాదు. సీతాన్వేషణ అనేది దైవికమైన పనిసాధించవలసిన కార్యం మానసికం కాకుండా మోక్షప్రాప్తి కలిగించేది, ఉపాసనాపరమైనది కాబట్టి,రాముడు నాకు కనిపించిన తీరులో భేదం ఉంది. " 

సీతాన్వేషణ గవేషణ. అనగా, దేనినైతే యదార్థంగా వెదకవలెనో, దానిని వెదకుట గవేషణఅన్వేషణ చేయవలసినది పరమేశ్వరీ సాక్షాత్కారము కొరకు, మోక్షప్రాప్తి కొరకు. దానికొరకు, గాఢమైన భావన, ఉపాసన అత్యంతావశ్యకముహనుమ రామోపాసకుడుఅనగా, పరమేశ్వరీ ఉపాసకుడుసీతారాములకు తత్త్వములో భేదము లేదు. ఇది హనుమకు తెలియును.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like