Friday 4 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 744 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతార ఖండము)




పటుబాహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే
యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు ' నోహో తండ్రి ! యా బాణ మి
ట్టటు నట్టిట్ల ' ని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప, జె
ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్.

తన విల్లేగతిఁ బట్ట నమ్ము నెటు సంధానింప గైకేయిఁ శా
సనమే శాసనమా ప్రభూత్తమునకున్ జక్కంగఁ గైకేయి  విం
టిని నీప్రక్కగ నమ్మిటుల్ వదలుకొంటే దాకు నందంచుఁ జె
ప్పును, లక్ష్యంబునుఁ దాకు, రాముడును నవ్వున్, నవ్వుఁ గైకేయియున్.

ఎలమిన్ దానిది వేళపాళయని లేదెల్లప్పుడున్ రామచం
ద్రులు తానున్ తన కార్ముకంబు వడిఁ జేరున్ గైకయీసౌధభూ
ములఁ దత్సౌధసమీపవృక్షనివహంబుల్ లక్ష్యముల్ దూయు లో
పల రా మంథర పోవ మంథర భయభ్రాంతిన్ సివా లాడగన్.

తా హాస్యాద్భుతశీలి రాముడు పృషత్కంబుల్ ప్రయోగించుచో 
హాహాకారము లేచు మంథరను రాయన్ బాయగా నేయు
ద్దాహాకారము లెంతగా బలియునో హాస్యంబుఁ దా నంతగా 
బాహాస్ఫాలనమూర్తి చేయు రఘురాట్బాలుండు గగ్గోలుగాన్.

దాశరథులు పెరిగి పెద్దవారవుతున్నారుధనురభ్యాసం చేస్తున్నారు. రామునికైతే కైకమ్మ తోడిదే లోకం తల్లికి కూడా అంతే

" ఆజానుబాహువైన రాముడు ప్రతిరోజు ధనురభ్యాసం చేయటం, కైకమ్మ వచ్చి  అది చూసి, " ఓహో ! నాన్నా ! బాణమిట్లా వెయ్యాలి..... ఇట్లా .....ఇట్లా ..." అని చాలా దూరంగా చిత్ర విచిత్రమైన రీతుల్లో లక్ష్యాల నేర్పరచటం, దగ్గరుండి చెప్పటం, చేయించటం, లక్ష్యాన్ని ఛేదించగానే సంతోషపడటం,.. ఇదీ కైకమ్మ సౌధాంతర్గత ఉద్యానవవంలో దైనందిన చర్య.

రామునికి కూడా, ధనుస్సును ఎట్లా పట్టుకోవాలో, బాణాన్ని ఎట్లా గురిపెట్టాలో, పినతల్లి చెప్పిన మాటే శాసనం. కైకేయి చెప్పినదంతా చక్కగా విని, రాముడు లక్ష్యాన్ని తాకేటట్లు బాణం వేసి, అది లక్ష్యాన్ని తాకగానే, రాముడు కిలకిలా నవ్వుతాడుఅది చూసి కైకమ్మ కూడా నవ్వుతుంది

వాళ్ళిద్దరికీ వేళాపాళ అని లేదురాము డెప్పుడూ ధనుస్సును బుజానికి తగిలించుకొని, బాణాలను పట్టుకొని కైకేయి సొధానికి చేరేవాడు. సౌధప్రాంతం లోని చెట్లను లక్ష్యాలుగా చేసుకొని బాణాలను ఎక్కుపెట్టేవాడు. అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరుగుతున్న మంథర భయంతో సివమెత్తినట్లుగా అరిచేది.

రాముడు పరిహాసశీలి. మంథరను చూడగానే అద్భుతమైన హాస్యాన్ని పండించేవాడురాముడు బాణం వేయగానే మంథర హాహాకారాలు చేసేది. అది చూసి, మంథరను రాచుకొంటూ వెళ్ళేటట్లుగా రాముడు బాణాలు వేసేవాడు. మంథర అరుస్తూ  పరుగెత్తుకొంటూ వెళ్ళేదిమంథర ఎంత పెద్దగా హాహాకారాలు చేసేదో, రాముడంత  విరివిగా బాణాలు వేసేవాడు. దానితో మంథర పెడబొబ్బలు పెట్టేది. "

పద్యాలలో పినతల్లి కైకేయికి రామునికి మధ్య పెనవేసుకొన్న గాఢానుబంధం ఒకప్రక్క, మంథర రామునిపై మాత్సర్యం వహించటానికి హేతువును ఒక ప్రక్క, రాముని యొక్క ధనురభ్యాసం కాలంలో విశ్వనాథ చక్కగా చూపించారు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము లోనివి.















No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like