Sunday 20 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 773 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)


ఇంత కోపమ్ము వచ్చినదింత కోప
మనుచు రాలేదనుచు లేద యసురపతికి
వీనిఁజంపనె వలయు దర్వీకరాభుఁ

గాటుపై గాటు వేసెడుగాదె యనుచు.

అపుడు స్వయంభుదత్తము మహాశనికల్పము సర్వదేవతా
రిపువు హుతాశనాంశునిబిరీసము ధూర్జరమైనదిన్ మహా
స్త్రపుఁ బదనైనశక్తిని భరంబగుదాని నిగిడ్చె రాము
మ్ముపయిఁ బ్రవేగవంతము నమోఘము పూర్వమహాహవంబులన్.

పత్రిగతిన్ శరత్రితయవారితమయ్యు నదృశ్య మౌచు సౌ
మిత్రిని దాకె శక్తి విషమించిన చేతనశక్తిగా మహా
పత్రప నంది చేతనము వాసి ధరం బడె నంతలోన సౌ
మిత్రియు వైష్ణవంబు తన మిక్కిలి తేజము సంస్మరించుచున్.

లక్ష్మణుడు రావణుని ధనుస్సుల నొకదాని తరువాత నొకటి ముక్కలు ముక్కలు చేశాడుఅపరాథం చేసినవాడిని నిలబెట్టి శిక్షించినట్లుగాచేతిలో విల్లు లేనటువంటి రావణుడిని లక్ష్మణుడు బాణాలతో యెడాపెడా కొట్టాడు

" దానితో రావణుడికి చెప్పలేనంత కోపమొచ్చింది.  " పాము కాటుపై కాటు వేసినట్లుగా, ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నాడుఇతడిని చంపకుండా వదలకూడదు" అని అనుకొన్నాడు రావణుడు

అపుడు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి, పిడుగుపాటు వంటిదానిని (వజ్రాయుథమంత శక్తివంతమైన దానిని), సర్వదేవతలకు శత్రువైనదానిని, అగ్నిజ్వాలల వలె దట్టంగా అలుముకొనే దానిని, మహాస్త్రముల యొక్క శక్తిని మించినదానిని, మహావేగవంతమైన దానిని, అమోఘమైన అస్త్రాన్ని (బ్రహ్మాస్త్రాన్నిరాముడి తమ్ముని మీద ప్రయోగించాడు.

లక్ష్మణుడు మూడు బాణాలతో బ్రహ్మాస్త్రాన్ని నివారించాలని చూసాడు. అది ఆకు గాలిలో తేలుతున్నట్లుగా అదృశ్యమై, మరల వచ్చి లక్ష్మణుడిని తాకిందిలజ్జాభరితుడైన లక్ష్మణుడు చైతన్యం తగ్గిపోయితనదైన వైష్ణవతేజాన్ని తలచుకొంటూ నేలపై పడిపోయాడు. "

చెప్పలేనంత కోపమొచ్చిం దనటానికి, ' అంతాఇంతా కోపమని కాదు ' , ' ఇంత కోపమొచ్చింది, అంత లేదని గాదు ' మొదలగునవి అచ్చంగా తెలుగువారు వాడే పలుకుబడులు

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like