Wednesday 16 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 772 ((శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)


మనసు ద్విధాకృతంబయిన మాదిరి తోన గ్రహించి లోపలం 
దనియదు చిత్తమున్ నయనతామరసంబుల నంటి యున్న దౌ
మన సొకడే సుఖంపడిన మాదిరి స్పష్టముగాగ నంజనా 

తనయుడు నిట్టు లౌటకు  నిదాన  మదేమని చిత్తగించుచున్.

మఱియు విశాలమైనది విమానము  నాల్గుప్రదేశముల్ పొరిం
బొరిఁగని యంతటన్ నిదురపోయెడు కాంతల తృప్తి లక్షణం
బరయుచు దాదృశంబయినయట్టిది తృప్తియు నీమెదౌ ముఖాం
బురుహములందు నంగముల పొందికలోపలనట్లె కాంచుచున్.

మానవరాజు లార్యులు క్షమాప్రథముల్ మనుసర్వధర్మ వి
జ్ఞానులు  చాన యన్యజన సంగతి పొందుట వారి యిండ్లలో 
లేనిది భర్త పోయినను లేమ సహోదరుఁ బొందఁబోవ దం
దైన సుమానుషంబున కుదాహరణంబులు వారిపొందులున్.

హనుమంతుడు పుష్పకంలో శయ్యపై నిద్రిస్త్రున ఒక అందమైన స్త్రీని చూసి, ఆమె సీతామహాదేవి కావచ్చునేమోనని అనుకొన్నాడుకానీ యెందుకో లోపల మాత్రం అంత తృప్తిగా లేదు

" మనస్సు రెండు రకాలుగా ఆలోచిస్తున్నదని గ్రహించిన వెంటనే, బయట కంటితో సంబంధమున్న మనసొక్కటే సౌఖ్యానుభూతి పొందుతున్నదని, లోపలి మనస్సు మాత్రం తృప్తి చెందటం లేదని హనుమకు స్పష్టమయింది విధంగా అవటానికి మూల మేమిటా అని ఆలోచింపసాగాడు.

పుష్పక విమానం చాలా విశాలమైనది. పుష్పకం నాలుగు వైపులా చాలా జాగ్రత్తగా చూసాడు. దానిలో నిద్రపోయే స్త్రీల ముఖాల్లో తృప్తి లక్షణాన్ని పరీక్షించాడు. సీతాదేవి అని తాను భ్రమపడిన స్త్రీ ముఖంలో, అవయవాల పొందికలో కూడా అటువంటి తృప్తి లక్షణమే ఉన్నదని గ్రహించాడు

మానవరాజులు పూజ్యులు. క్షమాగుణం కలిగినవారు. మానవజీవితాన్ని నడిపించే మనుధర్మశాస్రాన్ని బాగా అర్థం చేసుకొన్న విజ్ఞానఖనులువారి స్త్రీలు అన్యజనములతో కలిసి ఉండటం అనేది ఎరుగనివారుభర్తను కోల్పోయినా కూడా సహోదరుని వద్దకు పోనటువంటి సౌశీల్యవతులు, అభిమానవతులు వారుఉత్తమ మానవధర్మానికి  వారి నడతలు మంచి ఉదాహరణలు. " 

హనుమంతుడు మొదట కొంచెం భ్రమ పడినా, తరువాత వివేకంతో సూక్ష్మపరిశీలన చేయగలిగాడు.. సత్పురుషులు ఒకవేళ పొరబడినా, మరల వెనక్కి తిరిగి చూసుకొనివిషయాన్ని పరిశీలించి, అన్ని కోణాల్లోను కూలకషంగా అధ్యయనం చేస్తారుబుద్ధిమదగ్రగణ్యుడైన ఆంజనేయుడు చేసింది అదే.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర ఖండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like