Sunday 20 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 774 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అహల్యా ఖండము)


జులపాలజుత్తుగల యీ పసిబాలుని నే నెఱుంగుదున్
రాజ ! యొసంగగా వలయు రాముని నాకయి దైత్యలోక ప్రా
ణాజిరబద్ధపీఠుఁ డయినట్టి యముం డితడా దితిప్రసూ

తాజిన మంత తా నొలుచు నద్భుత శౌర్య నిధాన మీతడున్.

దైత్య తనూవిదారణ విధానపటిష్ఠుడు రామమూర్తి దౌ
ర్గత్యము గల్గె దైత్యులకు  గాలము చేరువ యయ్యె వారికిన్
సత్యపరాక్రముండు రఘుశాబకుఁడేను నెఱుంగుదున్ దప
స్స్థిత్యమృతాత్మదీధితి వశిష్ఠుఁడెఱుంగును దక్కు మౌనులున్

క్షీరాస్యుండగు తండ్రికిన్ బహువిధ శ్రేయంబుఁగూర్తున్ ద్రిలో
కీరారాజదుదారకీర్తివిభవ క్రీడానిధిం జేయుదున్
మూరింబో మమకారమేమి ఫలమో? భూపాల ! దైత్యాసు బా
ధారీఢోగ్రభుజాద్భుతున్ గొడుకు నంతఃపత్తనిన్ నిల్పినన్

రాముడిని విశ్వామిత్రునితో అరణ్యానికి పంపటానికి తటపటాయిస్తున్న దశరథునితో ముని ఇలా అంటున్నాడు

" మహారాజా ! ఉంగరాల జుట్టు పిల్లవాడి సంగతి నాకు తెలుసయ్యా ! ఇతడిని నాతో పంపించక తప్పదుఇత డెవరనుకుంటున్నావుయుద్ధభూమిలో రాక్షసుల ప్రాణాలను తీయటానికి బద్ధకంకణం కట్టుకొన్న యముడితడు దితిసంతానం మొత్తాన్ని మట్టుపెట్టగల శౌర్యనిధి

రాక్షస సంహార విధానంలో  పటిష్ఠుడైన రామమూర్తి చేతిలో చచ్చే దుర్గతి పట్టింది వారికి. వారికి పొయ్యేకాలం దగ్గరకొచ్చిందిసత్యపరాక్రముడైన రాముడి సంగతి నాకు తెలుసు. అఖండ తపస్సుతో  అమృతాత్మ అయినటువంటి  వశిష్ఠ మహర్షికి తెలుసుతక్కినవారి కెవరికీ రాముని శక్తిసామర్థ్యాలు తెలియవు.

పాలుగారుతున్న యీ చిట్టితండ్రికి సర్వశుభాలు కలుగజేస్తానుముల్లోకాల్లో రారాజు లాగా కీర్తివైభవాలను అందుకొని తులతూగే వాడిగా చేస్తానుఊరకే నశించిపోయే మమకారం పెంచుకోవటం వల్ల ఏం ప్రయోజనందుష్టరాక్షస సంహారం చేయగల బాహుబలపరాక్రముడైన కొడుకును అంతఃపురంలో ఉంచుకుంటే ఏమన్నా లాభమా? "

అంతకు ముందు " అమరగ నదిగాకయుఁ గోపము వచ్చుట లేదు తొంటివలె నాకు నృపా ! " అని కూడ అన్నాడు విశ్వామిత్రుడునిజంగానే, విశ్వామిత్రుడెంతో మారిపోయాడు. వశిష్ఠునితో తొల్లిటి స్పర్థ లేదుప్రతిదానికీ వశిష్ఠుడినే పరమప్రమాణంగా పెట్టుకొంటున్నాడుఅంతేకాదురామునిపై గల ప్రేమ అతడి ప్రతి మాటలోను ధ్వనిస్తున్నదిదానిని, " జులపాలజుత్తుగల యీ పసిబాలుని, రఘుశాబకుడు (పసికూన), క్షీరాస్యుడు (పాలుగారే ముఖం కలవాడు) ఇత్యాది మాటలలో ఛందోబద్ధం చేయటం వల్ల కవిసమ్రాట్టుల నిండు మనస్సుకు విశ్వామిత్రుని " నవ్య నవనీత సమానమైన మనస్సు " యెంత సన్నిహితమో ద్యోతకమౌతుంది. పేరులోనే పెన్నిధి ఉన్నట్లు, విశ్వామిత్ర మహర్షి నిజంగా విశ్వానికి మిత్రుడు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అహల్యా ఖండము లోనివి



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like