Friday 11 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 758 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)

తొలినాళ్ళన్ఁ గొడుకున్ స్నుషన్ బ్రియమునం దోకొంచురాగా  సుమం
త్రుల బంపించిఁ స్వభర్మహర్మ్యముల నెంతో ప్రేమతోఁ గొడ్కుకో
డలు క్రీడింపగఁ జేయుఁ బంక్తిరథుజాడన్ నేడగస్త్యాశ్రమ

స్థలి సీతారఘురామచంద్రులకుఁ దోచన్ఁ జిత్రమై యెంచుచున్.

నాకు నిజముగా నెపుడు స్వప్నములు రావు
రాత్రి యొక్కటే స్వప్నముల్ రామచంద్ర
కడుఁ బసిడి మేను పొడలు మాఘవతమణులు 
కనులు పచ్చలు మిన్నేగఁ గలుగు లేళ్ళు.

అనినన్ శ్రీ రఘుమూర్తి యిట్లనియెఁ గాంతా! నాకు నట్లే యగ
స్త్యుని యా పెంపుడుదుప్పి పెంటి విరహస్యూతాక్షికోణాగ్ని యెం
దున నేనుందునొ యల్ల దా మగిడి యందున్ వచ్చి తోచున్ సుధా
నన ! యేమున్నది భావలగ్నములు స్వప్నంబుల్ విడంబించెడున్.

సీత యొక్క పతిభావాన్ని గురించి ప్రశంసావాక్యాలు పలికిన అగస్త్య మహర్షి, సీతారాములను ఆశ్రమప్రాంతంలో రాత్రి సుఖంగా గడపమని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

" పెళ్ళయిన క్రొత్తల్లో, సుమంత్రుడిని పంపించి, కోడుకును కోడలిని ఎంతో ప్రేమతో తన భవ్యమైన మందిరానికి రప్పించి, వారు సుఖానందడోలికల్లో ఊగులాడేటట్లు చేశాడు దశరథుడునేడు అగస్త్యాశ్రమ ప్రాంతంలో కూడా సీతారాములకు అదే భావం కలగటం చాలా చిత్రమనిపించింది. "

తెల్లవారిన తరువాత, సీత రాముడితో యిలా అన్నది.

" రామచంద్రా! నేను నిజం చెపుతున్నాను. నాకెప్పుడూ కలలనేవి రావుకానీ, అదేమిటో రాత్రి ఒకటే కలలనుకో. ఒళ్ళంతా బంగారం రంగుతో, ఒంటిపైన ఇంద్రనీలమణులు పొదిగినట్లు పొడలు పొడలుగా, కళ్ళేమో పచ్చలు లాగా మెరుస్తూ, ఆకాశంవైపుకి దూకుతున్న లేళ్ళు కలలో కనపడ్డాయి.

మాట వినగానే రాముడు, "  సీతా ! నాక్కూడా అలాంటిదే కల వచ్చింది సుమా ! అగస్త్య మహర్షి యొక్క పెంపుడు దుప్పి, తనకు దూరమైన ఆడదుప్పి మీద విరహంతో నిండిన కంటికొసలతో చూస్తూ , నే నెక్కాడుంటానో అక్కడకల్లా వస్తున్నట్లు తోచింది. అమృతముఖీ ! ఇందులో ఏముందిమనస్సులో స్థిరంగా నిలిచిపోయిన భావాలే కలలుగా రూపుదిద్దుకొంటాయి. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని యీ పద్యాలు ప్రతీకాత్మకంగా భవిష్యత్తులో జరుగబోయే దానిని సూచిస్తున్నాయి.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like