Saturday 5 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 747 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)




ఒక మహాశనిచే గనకోర్విధరము
సానువున వ్రయ్యలై  ధాతు సంగతారు
ణాంబువులతోడి బుగ్గ పెల్లార్చి కొట్టి
నట్లు కనిపించె వాలి మహాపఘనము.

ఎఱ్ఱ వెన్నెల లుమిసెడు హిమనవాంశు
బింబ సంగతైరావణ విమలదంత
మూడి పడినట్లుగా ధాత్రి నొప్పె వాలి
శ్రమ సృగ్జలౌఘ కర్దమతనుండు.

వాలి ధాత్రి ప్రపతితుఁ డుజ్జ్వలుడు తోచెఁ
బడియగా నొక్కచోట నేర్పడిన నీట 
నింపుమీఱ నేకాకియౌ నెఱ్ఱ  కలువ
యూటిచనిన గంగానది యొడ్డువోలె.

మఘవదత్తము మౌక్తిక మణిసరంబు
వక్షమునయందు దీపింప వాలి యొప్పె
నింద్రచాపంబు చేతఁ బ్రావృషము సాంధ్య 
దరనవారుణమగు జలదంబు వోలె.

వాలిసుగ్రీవులు మల్లయుద్ధం చేస్తున్నారు. అంతకంతకూ సుగ్రీవుని బలం క్షీణిస్తుంటే, వర ప్రభావంతో, వాలి బలం హెచ్చుతూ ఉంది. సుగ్రీవుని దైన్యాన్ని గమనించిన రాముడు, చండతరప్రచండమైన బాణాన్ని సూటిగా వాలి వక్షస్థలంలో నాటాడునేలకూలిన మహాయోధుడు వాలిని వర్ణించేవే యీ పద్యాలు.

" మేరుపర్వతం మీద పెద్ద పిడుగు పడగా, మేరుపర్వత సానువు ఛిద్రమై, అక్కడ ఉన్న ధాతువులతో, ఎఱ్ఱని నీటితో కలిసిన బుగ్గ ఆవిరులు గ్రక్కుతూ పైకిలేచి పడినట్లుగా, వాలి భూమి మీద పడిపోయాడు.

ఉషఃకాల సూర్యబింబం యొక్క అరుణారుణ కాంతులు ఇంద్రుని గజరాజం ఐరావతం యొక్క తెల్లని దంతకాంతితో మిళితమవగా, దంతం ఊడిపడిందా అన్నట్లుగా, చెమట, రక్తంతో తడిసి నటువంటి వాలి శరీరం నేలపైన పడిపోయింది.

నేల మీద రక్తసిక్తంగా పడి ఉన్న వాలి, గంగానది ఒడ్డున ఏర్పడిన నీటిపడియలో, అతిశయించిన వన్నెతో, ఒంటరిగా ఉన్నటువంటి ఎఱ్ఱ కలువపూవులాగా కనిపించాడు.

ఇంద్రునిచేత ప్రసాదింపబడి, మౌక్తిక మణులతో కూడి, ధగద్ధగాయమానంగా మెరుస్తున్నటువంటి  కంఠహారాన్ని వక్షస్థలంలో ధరించిన వాలి, సాయంసంధ్యలో, ఇంద్రధనుస్సు యొక్క రంగు చేత ఎఱ్ఱబారిన వర్షాకాల మేఘం లాగా కనిపించాడు. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండములో, నేలకూలిన వాలిని విశ్వనాథ వర్ణించిన తీరు చూస్తే, మహాకవికి వాలి పాత్ర చిత్రణపై, అతని బలపరాక్రమాలపై యెంత  ఉదాత్తభావమో అర్థమవుతుంది. ఘట్టంలోని పద్యాలు చదువుతుంటే, పఠితల గుండెలు బరువెక్కక మానవు











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like