Thursday 3 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 742 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)




జనకనృపాల కన్యకకు జానువులందున మందరాద్రి తా
ల్చిన దొరవీపుడిప్పలవలెం గనవచ్చు నటంచు నెంచియున్ 
ఘనవినయాంబురాశియగు కామిని నిద్దురపోవువేళ చీ
రను తొడదాకగా నెఱుగరాదను నూహను ద్రోసిపుచ్చుచున్.

కడుకొని విల్లుపూనుటనుఁ గాయలుకాచిన చేతితోడ రా
ముడు గ్రహియించె నామె కరముం, గరముం గని తల్లిచేయి గు
ర్తిడనగు నందు మైథిలుకులేశ్వరి నిచ్చలు నేత్రబాష్పముల్
తుడుచుకొనంగ గుర్తులవితోచునొ  తోచవొయంచు నెంచుచున్.

పెదవుల పొందిక చిఱు
వ్వుదయింపగఁ బోవునట్టులుండు నటంచున్
మది నెంచి విరహమగు ని
య్యదనున నది కలిమి సంశయాస్పద మంచున్.

హనుమ లంకలో సీతాన్వేషణ చేస్తున్నాడు. కొంతమంది స్త్రీలు పుష్పకంలో నిద్రిస్తుండటం చూసాడు. వారిలో రావణుడు ఎత్తుకువచ్చిన దేవతాంగనలు కూడా ఉన్నారు. వారి మధ్య సీత జాడ కనిపిస్తుందేమోనని నిశితంగా పరిశీలిస్తున్నాడుతన బుద్ధివిశేషానికి పదును పెడుతున్నాడు

" జనకమహారాజు కూతురు మోకాళ్ళు మంథర పర్వతాన్ని  దాల్చిన ఆదికూర్మం వీపుడిప్పలాగా ఉంటాయని, జానువులను పరిశీలించాలని అనుకొన్నాడు హనుమకానీ, మహావినయసముద్రురాలయిన స్త్రీని, ఆమె నిద్రావస్థలో ఉన్న సమయంలో, ఒకవేళ చీర తొలగి ఉన్నా, తొడల వరకు పరిశీలించటం మర్యాద కాదనే భావంతో ఊహను ప్రక్కకు తోసివేశాడు

ఎల్లప్పుడు ధనురభ్యాసం చేత రాముని చేతులు కాయలు గాచి ఉంటాయనీ, కాయలు కాచిన చేతితో సీతాదేవి చేతి నందుకొన్నాడు కనుక చేతిని చూసి, తల్లి చేతిలో రాముని చేతిముద్రలను గుర్తుపట్టవచ్చుననుకొన్నాడుకానీ, నిరంతరం రాముడినే తలచుకొంటూ, పెల్లుబికి వచ్చే కన్నీటి ధారలను తుడుచుకొనటం చేత, తల్లి చేతిలో గుర్తులు కనపడతాయో లేదోననే సంశయంతో, పనిని కూడా విరమించుకొన్నాడు హనుమ.

సీతమ్మ పెదవులు పొందికగా, చిరునవ్వుదయిస్తున్నట్లుగా ఉంటాయనుకొన్నాడు. కానీ, రాముని మీద విరహంతో, చిరునవ్వు ఉండటం కూడా అనుమానమేనని ఊరకున్నాడు. "

సుందర కాండము హనుమంతుని వివేచనకు, బుద్ధి సూక్ష్మతకు, నిశిత పరిశీలనకు చక్కని వ్యాఖ్యానం. వస్తు, విషయ పరిశీలనలో, బ్రహ్మజ్ఞాన సముపార్జనలో, " నేతి, నేతి = ఇతి (ఇది కాదు, ఇది కాదు) " అనేది ఒక ముఖ్యమైన పరీక్షాంశం

హనుమకు భావనలో సీతాదేవి సాక్షాన్నారాయణిగా తోచింది. నారాయణుని  స్త్రీరూపమే నారాయణి. అందువల్లనే, ఆమె జానువులు " మందరాద్రి దాల్చిన దొరవీపుడిప్ప " లనడంలలితాసహస్రనామాల్లో, అమ్మవారు " మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా " అని వర్ణింపబడింది. మాణిక్యం చాలా గట్టిగా ఉంటుంది. తాబేలు వీపుడిప్ప చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాదు, మోకాలుచిప్ప కిరీటం వలె, టోపీ వలె ఉంటుంది

అమ్మవారి నామాన్ని స్మరించినంత మాత్రాన మంథర పర్వతమంతటి కష్టాలైనా దూదిపింజల్లాగా ఎగిరిపోతాయని పెద్దలంటారు. కారణం చేత, హనుమ తలపులో నామార్థాన్ని స్ఫురింపజేసే భావన ఉండటం, కష్టతరమైన అమ్మవారి సాక్షాత్కారం (సీతాన్వేషణ) ఫలిస్తుందనడానికి సూచనగా గ్రహించవచ్చు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like