Sunday 13 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 766 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)


తల్లినిబట్టి చూచికొనుఁ దాను సమీరసుతుండు లోకమం
దెల్లెడ నందమన్నది యేగతి నుండు నటంచు నీ తనూ
హల్లకగంథి యిప్పటికి నాగిన దాతని యీ పరీక్షకుం
జెల్లరె యీమె కావలయు సీత యటం చనుకొన్న యంతలో.

ఎంత యాలోచనాపరుం డేని సుంత
తొందరపడు శ్రమపడి తోనతోన 
కనగ రామున కాంజనేయునకు నిద్ది
భేద మీ సుంత తొందర లేదు పతికి.

సీతంగాంచితి నంచు నెంచుచుఁ గపిశ్రేష్ఠుండు లాగూలముం 
జేతంగైకొని ముద్దుగొంచు హసన శ్రీగండభాగుండునై
దూతత్వంబు ఫలించెనం చెగిరి గంతున్ వేసెనేకాని తాఁ
జేతో నిర్వృతి గాంచఁ డింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా.

లంకానగరంలో సీత కొరకు వెదుకుతున్న హనుమకు ఒక మృదుశయ్య పైన నిద్రిస్తున్న స్త్రీ కనిపించింది. తల్లి లక్షణాన్ని బట్టి  స్త్రీగత సౌందర్యాన్ని పోల్చుకొనే  స్వభావమున్నవాడు హనుమంతుడు.

" శీలానికి తల్లి సీతాదేవిని కొలమానంగా పెట్టుకొని లోకంలో  స్త్రీ యొక్క సౌందర్యం యీ రకంగా ఉంటుందని పోల్చుకొంటాడు వాయునందనుడైన హనుమ. అతని పరీక్షకు ఇప్పటివరకు నిలిచింది మృదుశయ్యపై నిద్రిస్తున్న యీ సౌందర్యవతి మాత్రమే. ఆమె సీత కావచ్చునని అనుకొన్నాడు.

ఎంతటి ఆలోచనాపరుడైనా, శ్రమ పడటం వలన, కొంచెం తొందరపడటం సహజం. రాముడికి ఆంజనేయునికి యీ కొంచెం భేదం ఉంది కొంచెం తొందపడటం కూడా శ్రీరామునికి లేదు.

సీతను చూశానన్న ఆనందంతో ఆంజనేయుడు తోకనెత్తి పట్ట్టుకొని ముద్దాడి, చెక్కిలి మీద చిరునవ్వు తొణికిసలాడుతుండగా, తన రాయబారం ఫలించిందని యెగిరి గంతేశాడు కానీ, బయటి మనస్సు రంజిల్లినంతగా, లోపలి మనస్సు మాత్రం కుదుటపడలేదు. "

హనుమంతుడు తన అన్వేషణలో మండోదరిని చూసి సీత అని భ్రమించాడు. మండోదరి పతివ్రత పాతివ్రత్య లక్షణం హనుమను కొంచెం తొందరపడేటట్లు చేసి, నిదానంగా మరికొంత విశ్లేషణ చేయనీయకుండా తాత్కాలికంగా నిరోధించింది. మహాత్ముల యెడల ఇది తాత్కాలికమైన తొందరపాటు కావున, హనుమ బయటికి సంతోషించినట్లు కనపడినా, అతడి అంతశ్చిత్తం మాత్రం కుదుటపడలేదు.

తనూహల్లకగంథి అంటే సువాసనలు వెదజల్లే శరీరం కలది (యోజనగంథి వలె).
హల్లకము = చెంగలువ

పద్యాలు శ్రీమద్రామాయ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like