Saturday 12 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 762 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అహల్యా ఖండము)


రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్ 
రాముడె యెల్ల నా బ్రతుకు రాముడు నన్నును గన్నతండ్రి యీ
రాము వినా నిమేష మవురా మనజాలను గాదయేని నీ 
రాముని వీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా ! గ్రహింపవే

విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. దశరథుడు కూడా చేయవలసిన సేవలన్నీ చేసాడువిశ్వామిత్రుడు మహాతపశ్శాలి అనే భక్తితోనో, ఆయన మహాకోపిష్టి అనే భయంతోనో, లేక లేక పుత్రులను కలిగారన్న సంతోషంతోనో, దశరథుడు విశ్వామితుడేమి  కోరుకొన్నా తీరుస్తానన్నాడు.

విశ్వామిత్రుడు రాముడిని తనతో పంపమనేటప్పటికి గుండెలో రాయి పడినట్లయింది.   ' చిత్తం, చిత్తం ' అంటూనే, విషాదవదనంతో, దశరథుడు మునితో ఇలా అన్నాడు.

" మహర్షీ ! నా కన్నీ రాముడేశుచిత్వం కోసం నేను చేసే స్నాన, జప, ధ్యానాదు లన్నీ రాముడేనా బ్రతుకు పరమార్థం రాముడే. రాముడు నా కన్నతండ్రి, గారాలపట్టిరాముడిని విడిచి నేనొక్క నిముషం కూడా బ్రతుకలేను. ఇక మీరు తప్పదంటే, నా రాముడిని విడిచిపెట్టి యీ సమస్త రాజ్యాన్ని తీసుకొనండి. "

స్నానం శారీరక శుద్ధిని, జపం మానసిక శుద్ధిని, ధ్యానం ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తాయి.

దశరథుడు విశ్వామిత్రుడిని,  " గాధిసుతా ! " అని సంబోధించటంలో కొంత ఆత్మరక్షణ, ఆపద్ధర్మ పాలన ఉన్నాయనిపిస్తుందికుశనాభుని కొడుకైన గాథికి సత్యవతి అనే కూతురు ఉంది. ఆమెను చూసి ఋచీకుడు అనే మునీశ్వరుడు తనకిచ్చి వివాహం చేయమన్నాడు. వృద్ధమునికి కూతురు నివ్వకుండా తప్పించుకోవటానికి, చెవులు  నల్లగా, ఒళ్ళంతా తెల్లగా ఉన్న గుర్రాలను ఇవ్వమన్నాడు గాధిఋచీకుడు తన తపశ్శక్తితో, గుర్రాలను తెప్పించి ఇవ్వటం చేత, సత్యవతిని అతని కిచ్చి వివాహం చేయక తప్పలేదు. గాధికి జన్మించినవాడే విశ్వామిత్రుడుఆపద్ధర్మంగా ఒకదాని బదులు ఇంకొకటి కోరటం, ఒకదాని బదులు ఇంకొకదాని నివ్వటం ఆపద్ధర్మమని  విశ్వామిత్రునికి గాధి ఉదంతాన్ని దశరథుడు గుర్తుచేసాడా అన్నట్లున్నది యీ సంబోధన

ఇక రెండవది, బ్రహ్మర్షి పదవిపై కాంక్షతో రాజ్యాన్నే త్యాగం చేసాడు విశ్వామిత్రుడుపరబ్రహ్మ స్వరూపమైన రాముని కోసం రాజ్యాన్ని ధారాదత్తం చేస్తానంటున్నాడు దశరథుడు.

పద్యంలో రామునిపై దశరథుని ప్రేమ, పుత్రవాత్సల్యం యెంతగా పెనవేసుకుపోయిందో అర్థమౌతుంది. దశరథునికి జగమంతా రామమయం. రాముని కోసం, విశ్వామిత్రుని యెడల భీతి వహిస్తూనే, సంశయిస్తూనే, చెప్పవలసిన మాట చెప్పాడు.

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనిది


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like