Sunday 13 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 768 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అహల్యా ఖండము)


నీ కొడుకును గైకొని చని
మా కాకలి యంచుఁ దిందుమా? పిచ్చినృపా !
మాకడఁ బ్రశస్త మస్త్ర
వ్యాకృతి కలదద్ది నేర్పి పంపెద మింతే !

ఇమ్మగు విద్య నేర్పెదము నింకను చిన్న మెత్తు కా
ర్యమ్మును జేసిపెట్టవలె నాపయిఁ బూవులలోనఁ బెట్టి కై
కొమ్మని నీ కుమారుఁడిడుగో నని నీక యొసంగు వార మా
పిమ్మట నీవుగా నతని వీడవలెన్ మఱి మాకు నేటికిన్.

రాముడిని తనతో పంపమని, అస్త్రవిద్యా విశారదుడిని చేస్తానని విశ్వామిత్రుడు దశరథునికి చెప్పాడు. రాముడు తన జీవిత సర్వస్వమని, రాముడిని పంపటం తప్ప రాజ్య త్యాగం చేయమన్నా చేస్తానని దశరథుడు మహర్షిని వేడుకొన్నాడుదానితో కించిత్తు కినుక వహించినా, అనునయిస్తున్న ధోరణిలో, విశ్వామిత్రుడు రాజుతో ఇలా అన్నాడు.

" రాజా ! ఎంత బేలగా మాట్లాడుతున్నావు. నీ కొడుకును మాతో తీసుకువెళ్ళి, మాకు ఆకలయ్యిందని, నీ కొడుక్కి పెట్టకుండా తింటామా? దగ్గర అపూర్వమైన అస్త్రవిద్య ఉందయ్యా ! దాన్ని చక్కగా నేర్పి పంపిస్తా మంతే

మా వద్ద ఉన్న అపారమైన ఉన్న అస్త్రవిద్యను నేరుతామంటున్నాము. అయితే, మాకొక చిన్నమెత్తు పనిని కూడా చేసి పెట్టాలనుకోతరువాత నీ కొడుకుని పువ్వుల్లో పెట్టి ,  ' ఇదిగోనయ్యా నీ కొడుకని ' నీకే అప్పగిస్తాముఅటుపిమ్మట నీ అంతట నువ్వు అతడిని విడిచిపెట్టాలి గానీమరి నీ కొడుకు మాకెందుకయ్యా ! "

దశరథుడు రాముడిని పంపనని ఖరాఖండిగా చెప్పినా, ముందుగా కించిత్తు కోపం తెచ్చుకొన్నా, తరువాత మునుపటి స్వభావానికి భిన్నంగా, విశ్వామిత్రుడు అనునయంగా మాట్లాడటం గమనార్హంరాజును " పిచ్చినృపా ! " అని సంబోధించిన తీరు విశ్వామిత్రుడు దశరథుని యొక్క తండ్రిహృదయాన్ని అర్థం చేసుకొన్నాడని, లేకలేక పుట్టిన, ప్రాణానికి ప్రాణమైన, దశరథుని దృష్టిలో పసివాడైన రాముడిని పంపటానికి సంశయిస్తున్నాడని స్పష్టమౌతుంది

మహర్షులు త్రికాలవేదులు. విశ్వామిత్రుని మాటలలో భవిష్యత్తులో జరగబోయే రాముని వనవాసానికి సంబంధించిన విషయం ధ్వనిస్తున్నది.

విశ్వనాథను గురించి ఒక్కమాటలో చెబుతూ ఆచార్య ముదిగొండ శివప్రసాదు గారు, " ఆయన బయట విశ్వామిత్రుడు, లోపల వశిష్ఠుడు " అన్నారువిశ్వనాథది " నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. "  విశ్వామిత్రుడి హృదయం నవ్యనవనీత సమానం, మాట మాత్రమే వజ్రాయుధమంత పదును. అందుచేతనే, తనదైన స్వభావాన్ని విశ్వనాథ, విశ్వామిత్రుని పాత్రలో అద్దంలో చూసినట్లు చూడగలిగారు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనివి

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like