Friday 4 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 745 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)




అమ్మా ! అమ్మ ! యిదెల్ల మోహము గదమ్మా ! చూడనుంజూడ దే
హమ్మున్ దేహము నంతటి దగ్గరివటమ్మా ! మోహముం ధర్మమున్ 
గొమ్మా! తొల్తటి దెంత బోలొ, తుదిదో కొమ్మంతయౌఁ జేవ, రా
జ్యమ్మున్ వీడగ నేమి విప్లవము సంప్రాప్తించె నీ నేలకున్.

తల్లియు సుమిత్ర యెంత శాంతాత్మ యౌనొ
కొడుకు లక్ష్మణుఁ డంతటిఁ కోపరాశి
తల్లి కైకయి యెంత సంతప్తమతియొ
భరతుఁ డంతటి శాంతస్వభావరాశి.

ఎవరు యెంత చెప్పినా, ధర్మానికి కట్టుబడి రాము డడవికి పోవటానికే సంకల్పించాడని స్థిరనిశ్చయం చేసుకొన్న కౌసల్య దుఃఖిస్తూ ఉంటే, రాముడు ఆమెను కౌగలించుకొని, కన్నీటిని తుడిచి, ఓదార్చి ఇలా అంటున్నాడు.

" అమ్మా ! దుఃఖం, కోపం, తాపం, ఇవన్నీ మోహం వల్లవచ్చినవే కదాచూడగా చూడగా, దేహానికి దేహానికి ఇంత దగ్గరి చుట్టరికమా? మోహం, ధర్మం  - రెండింటినీ ఒక్కసారి లోతుగా పరిశీలన చేయిమొదటిది యెంత డొల్లతనం కలిగిందో, చెట్టుకొమ్మ లాగా ధర్మమంత చేవ కలిగినది. నేను రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినంత మాత్రాన యీ భూమిలో విప్లవ మొస్తుందా ఏమిటి? "

సవతులలో తన తల్లి చులకనౌతుందన్న భావాన్ని కూడా నిర్ద్వద్వంగా ఖండించాడు రాముడుదశరథుని భార్యలలో, తన తల్లి ఎప్పటికీ పట్టపురాణేనని చెప్పి, తన తమ్ముడు భరతుడు అంతటి అధర్మపు రాజా అని ప్రశ్నించాడు.   సందర్భంలో రాముడన్న మాటలు, రాము డెంతటి " విశేషభావమతి, సంశుద్ధుం డవిద్ధాత్ముడో " తెలియజేస్తాయి.

" అమ్మాఇది చూడు. తల్లి సుమిత్ర యెంత పవిత్రాత్మ, శాంతస్వభావురాలో, ఆమె కొడుకు లక్ష్మణు డంతటి కోపిష్టితల్లి కైక యెంత తాపానికి గురి అవుతుందో, కొడుకు భరతుడు డంతటి నిండుకుండ, శాంతస్వభావుడు. " 

లక్ష్మణుడు ఆదిశేషువు అంశతో పుట్టినవాడు. బుసలు కొట్టడం ఉపాసనా స్వరూపుడైన అతని జీవలక్షణం. పరమ భాగవతోత్తముడైన భరతుడో, శ్రీ మహావిష్ణువు పూరించే శంఖము యొక్క అవతారం. శంఖం నుంచి వెలువడేది ప్రభువు నాదమేఅందువల్లనే, రామాయణంలో, భరతుడు ముమ్మూర్తులా రాముడే.

తత్త్వాన్ని బోధపరిచే ఇంత చక్కని పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like