Monday 7 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 752 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)




ప్రమదారత్నము కానఁ దోడరిగినన్ భర్తృవ్రతాలోకమౌ 
ళి మహారత్నము సీత యేమడిగినన్ లేదంచనన్ రాదు, ని
త్యముఁ గాంతార విహారఖిన్నమతి యేదైనన్ సరే కోరు, ను
త్తమురా లయ్యది తీర్చుటే మిగుల యుక్తంబౌను శ్రీరాఘవా

అన్యుల్ భార్య నగౌరవింత్రు, రఘురామా ! దంపతిశ్రేణి
న్యోన్యారాధనఁ జేసి యుత్తమ జగత్ప్రాప్తిన్ విడంబింత్రు,
మ్మాన్యుల్ భార్యను బట్టి వత్తురు నిలింపశ్రేణి క్రీడింప రా
జన్యశ్రేష్ఠ ! భవద్గృహాళి, వషట్ స్వాహా ప్రియాహూతులై.

రమణి రమణీత్వముననె యారాధనీయ
రమణి భార్యాత్వమునను నారాధనీయ
రమణి సీత పతివ్రతోత్తమ జగచ్ఛి
రస్థమణి దాన మిగుల నారాధనీయ.

నీరజనేత్ర ముగ్ధహరిణీప్రియ నీ సుకుమారి నిట్లు కాం
తారము తెచ్చినావు, విదితంబగు శైవధనుర్వికర్షణ 
క్రూరభుజాభిరాముడవు కోమలి కోరిక దీర్ప నీకు నీ
శూరత చాలదో, మరి అసుప్రియ జానకి ప్రేమ చాలదో !

అగస్త్య మహర్షి రామునికి సీతను గూర్చి ప్రత్యేక్యంగా కొన్ని మాటలు చెప్పాడు.

" స్త్రీలోకానికి శిరోభూషణం, పతివ్రతాశిరోమణి సీతఆమె నిన్ననుసరించి వనవాసానికి వచ్చింది, అందువల్ల, ఆమె నిన్నేది అదిగినా లేదనగూడదు. ఎప్పుడూ నీతోపాటు ఒంటరిగా అడవులలో తిరిగే ఆమె నిన్నేమైనా అడగవచ్చు.   రామా ! ఉత్తమురాలైన ఆమె కోరిక తీర్చటమే నీకు యోగ్యంగా భావించు.

సామాన్యమానవులు భార్యను అగౌరవ పరుస్తారుదంపతులు ఒకరి నొకరు ఆరాధిస్తూ ఉత్తమలోకాలను చేరాలని ఆకాంక్షిస్తారు. ఇక ఆరాధనీయులైన దేవతలు, యజ్ఞాలలో వినబడే వషట్కార స్వాహాకారాలచే ఆహ్వానితులై, గృహిణిని బట్టే ఇంటి గడప తొక్కుతారు.

స్త్రీ భర్తను అలరిస్తుంది కాబట్టి ఆమె  ఆరాధించదగింది. ఆమెలో ఉన్న భార్యాత్వం చేత కూడా ఆమె ఆరాధించదగిందిపతివ్రతాతిలకమైన సీత స్త్రీలోకానికే మణిభూషణం వంటిది. అందువల్ల, ఆమె విశిష్టంగా ఆరాధించదగింది.

పద్మనేత్ర అయిన యీ సుకుమారికి అమాయకంగా ఉండే లేళ్ళు, జింక లంటే చాలా ఇష్టం.   లేళ్ళు, జింకలు విస్తారంగా ఉండే అరణ్యప్రాంతానికి ఆమెను తీసుకొచ్చావు. శివధనుర్భంగం చేసిన విక్రమాభిరాముడివి నీవు. ఆమె కోరికను తీర్చటానికి నీకు శౌర్యం చాలదా? లేక నీకు ప్రాణాధికమైన జానకి ప్రేమ చాలదా? "

ఇవీ అగస్త్యుడు చెప్పిన మాటలు. మహర్షులు త్రికాలవేదులు. అందునా అగస్త్యుడు జగత్కళ్యాణం కోసం తన జీవితాన్ని వెచ్చించినవాడుఅందుచేత, భవిష్యత్కార్యాలన్నీ ఆయనకు అవగతమేరావణుడు జంగమ వేషంలో సీతాపహరణం కోసం వస్తాడని, మాయలేడిగా మారీచుడు సీతను ఆకర్షిస్తాడని, ద్రష్టకు తెలుసు. కారణంగానే, అగస్త్య మహర్షి జరుగబోయే సంఘటనను దృష్టిలో ఉంచుకొని అన్యాపదేశంగా రామునికి కార్యాచరణను నిర్దేశించాడు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like