Sunday 20 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 775 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: ప్రస్థాన ఖండము)


జీబులల్లిన వనీసీమలోఁ బులుల సింగముల కాల్జాడలు గాంచినపుడు
కొండలపై నుండి కురిసెడు సెలయేళ్ళ సోనజల్లులవాక చూచినపుడు
అలపైని గొండకొమ్ములు తెల్లమబ్బులు క్రమ్మిపోయెడు వేళఁగనినయపుడు 
ఒకపెనుగాలి యుఱ్ఱూత లూగించుచో గళవళంపడు కానఁ గాంచినపుడు

భీతి పుట్టిననైనను భీతిలోనఁ
బ్రీతి తెలియకయును విడంబించు గాదె !
యచ్చముగఁ జెడ్డవస్తు వీ యవనిఁ గలదె

మించి సర్వము సుఖదుఃఖమిశ్రితంబె.

కలువపూమోము రాఘవ ! నీది వాడిన చల్లని కరములఁ జూడఁగలను
తమ్మిపూవంటి పాదము నీది నొచ్చినఁ దరణిబాష్పంబుల విరియఁగలను
సంపెఁగవోని నీ స్వాంతమ్ము గుఱుతించి షట్పదదూరంబు సాగఁగలను
చేమంతివోని నీ చేతఃప్రసన్నత శిశిర, మంజులత స్పృశింపఁగలను

  ఏట మున్గువానిని లేవనెత్తబోవఁ
గాళ్ళకడ్డమ్ము తిరిగి రక్షకుని ప్రాణ 
ములకుఁ దెచ్చెడి మూఢుని పోల్కి గాను
తక్కినవి యౌదుగాను, సంస్థాస్వరూప

సీత రామునితో పాటు వనవాసం చేయటానికి అనుమతి కోరుతూ, అడవితల్లి అంటే తనకెంత ఇష్టమో, అక్కడ రాముని కేవిధమైన సపర్యలు చేయదలిచిందో చెప్పింది.

" దట్టంగా ఉన్న అడవిలో, పులుల యొక్క, సింహాల యొక్క కాలిజాడలు కనిపించినపుడు, కొండలపై నుండి క్రిందికి  జాలువారే సెలయేళ్ళ నీటిధారల అందం చూసినపుడు, ఎత్తుగా ఉన్న కొండకొమ్ములను రాసుకొంటూ తెల్లని మబ్బులు క్రమ్ముకొన్న సమయాన దృశ్యాన్ని చూసినపుడు, పెనుగాలి ఉద్ధృతంగా వీచినపుడు, కళవళపడిపోయిన అరణ్యాన్ని చూసినపుడు, మనస్సులో భయం కలిగినా కూడా, ఏదో తెలియని ఇష్టం పుట్టుకొస్తుంది. ప్రపంచంలో అచ్చంగా చెడ్డవస్తువంటూ ఏమన్నా ఉందా? అంతా సుఖాదుఃఖాలతో కూడుకొని ఉన్నదే కదా !

రామా ! కలువపువ్వు వంటి నీ ముఖం వాడిపోయినపుడు చల్లని కరస్పర్శతో నిన్ను సేదదీర్చగలనుతమ్మిపూవు వంటి నీ సుకుమారమైన పాదాలు నొప్పిపుట్టినప్పుడు, వెచ్చని నా కన్నీటితో బడలిక పోగొట్టగలనుసంపెంగపూవు వంటి నీ ఏకాంతానికి భంగం కలుగకుండా, తుమ్మెదలాగా (ఆరడుగుల) దూరాన్ని పాటించగలను. చేమంతిపూవు వంటి నీ మనఃప్రసన్నతను శిశిర ఋతువు నందలి మెత్తదనంతో స్పృశింపగలనుఅయ్యో ! పాపమని నన్ను నీతో తీసుకువెళ్ళిన నేరానికి, ఏటిలో మునిగిపోతున్నవాడిని రక్షించటానికి వెళ్ళిన వాడి కాళ్ళు పట్టుకొని, రక్షకుని ప్రాణాలు తీసేటటువంటి మూర్ఖురాలి వంటి దానిని కాదు. ఇంకే విధంగాను కూడా నీకు ఇబ్బంది కలిగించను. "

సీత ప్రకృతి స్వరూపిణి. అందుచేత, ప్రకృతిలోని సమస్త వృక్ష, జంతు, వస్తుజాలంతో తాదాత్మ్యం చెందుతుంది

ఇక రెండవ పద్యంలో, రామునికి చేసే సపర్యలను గురించి చెబుతూ, భర్తను ' సంస్థాస్వరూప ! ' అని సంబోధించిందిరాముడు చక్కని వివాహ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు, సంఘ వ్యవస్థకు, రాజ్య వ్యవస్థకు, ధర్మ వ్యవస్థకు ప్రతీక.

విశ్వనాథ రాముని అవయవసంపదను పువ్వులతో పోలిక తెచ్చిన తీరు, అత్యంత రమణీయంకలువ చంద్రుని చల్లని కిరణాలతో వికసిస్తుందితమ్మిపూవు అతి సుకుమారమైనది. అది హేమంతంలోని మంచుబిందువులతో స్వచ్చంగా ఉంటుంది. షట్పద అంటే తుమ్మెద. తుమ్మెద అన్ని పువ్వుల మీద వ్రాలుతుంది ఒక్క సంపెంగ తప్ప. దూరాన్ని పాటిస్తుందిచేమంతులు శిశిరంలో విరియబూస్తాయిచేమంతి మెత్తదనానికి ప్రతీక. శిశిరంలో చెట్లు మారాకులు తొడుగుతాయి. మనస్సు యొక్క ప్రశాంతభావం చిగురుటాకుల మెత్తదనంతో పోల్చబడింది. విధంగా విశ్వనాథ వర్ణనలు కథలో అంతర్భాగంగా ఉండి, సహజ సుందరంగా భాసిల్లుతాయి

రెండు సీస పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్తాన ఖండము లోనివి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like