Friday 11 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 756 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అహల్యా ఖండము)

ఎవరయ్యా ! రఘురామచంద్రులకుఁ గానీ యస్త్రవిద్యాగురుల్ 
నవ బాహాపటుదీర్ఘదండునకు నీ నా వద్ద శిష్యత్వ మొ
ప్పవలెన్  శ్రీరఘురాము బాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్

వివృతంబుల్ మునికోటియజ్ఞతతి నిర్విఘ్నత్వ మొప్పన్ వలెన్.

మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నాకడన్ మహా
స్త్ర నిభృత విద్యలట్లె రఘురామునకై యవి యెల్ల నిచ్చెదన్ 
మనుజమహేంద్ర ! పంపుము కుమారుని నా వెనువెంట నూరకే
యనలము దాచుకొన్న ఫలమా? క్రతుయోగ్యము కావలెం జుమీ !


విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చాడు. మునీశ్వరుణ్ణి అర్ఘ్యపాద్యాలతో సముచితంగా పూజించిన తరువాత, దశరథుడు విశ్వామితుడిని ఏది కావాలంటే అది కోరుకొమ్మన్నాడుసంతుష్టాంతరంగుడైన మహర్షి దశరథునితో ఇలా అన్నాడు.

" ఎవరయ్యా రామునికి అస్త్ర విద్య నేర్పుతున్న గురువు? ఇప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న యీ ఆజానుబాహుడు నా దగ్గర గానీ లేకపోతే వశిష్ఠుని దగ్గర గానీ శిష్యరికం చేయాలిదానివలన, రామచంద్రుని యొక్క బాహుబలపరాక్రమాలు ప్రసిద్ధి వహించాలిమునుల యొక్క యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగాలి

భృశాశ్వుడిచ్చిన  అస్త్రసంపద ఎప్పటినుంచో నా దగ్గర నిరుపయోగంగా పడి ఉందిఇక నేను తపస్సు చేసి పొందిన మహాస్త్రసంపద కూడా అంతేరాజేంద్రా ! అవన్నీ రామునికి ఇస్తానునీ కుమారుణ్ణి నాతో పంపించు. అగ్నిని దాచుకొంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? అది యజ్ఞార్థం కావాలి సుమా ! " 

భృశాశ్వుడు ఒక ప్రజాపతి. దక్షప్రజాపతి కుమార్తెలైన జయ, సుప్రధ అనే వారిని వివాహమాడి ఎందరో పుత్రులను పొందాడు. వారందరూ అస్త్రము లయ్యారు. తదనంతర కాలంలో, విశ్వామిత్రుడు వాటిని పొందాడు

" అనలము దాచుకొన్న ఫలమా? క్రతుయోగ్యము కావలెం జుమీ ! " ఛందోబద్ధం చేసి ఎంత చక్కని సూక్తిని అందించారు విశ్వనాథ.

అగ్ని అతి పవిత్రమైనది. అగ్ని చేత శుద్ధి చేయబడనిదేదీ లేదుఅటువంటి అగ్ని క్రతుయోగ్యం కావాలి. అప్పుడే జగత్కళ్యాణం సిద్ధిస్తుంది. అలాగే, మానవుడు చేసే ప్రతి పని యజ్ఞార్థం కావాలి. అప్పుడే సర్వమానవ శ్రేయస్సు ఒనగూరుతుంది.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనివి.







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like