Sunday 6 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 748 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)




ఎఱిగియున్నవారి నెఱుగంగనగుఁ గాని
యెఱుగనట్టివారి నెఱుగు టెట్లు
అవనిజాత నెఱుగనను టెట్లు పొసగునో
యింత రామచంద్రు నెఱిగి యెఱిగి.

ఒక్కరిఁ పూర్వమందు వినియుందుము వారి గుణంబులందునన్ 
మక్కువ కలిగి యుందుమును మానుషమై చను వారి మూర్తి ము
న్నెక్కడఁ జూడ లేదయిన నేమగుఁ జూచిన యట్లెయుండు వా
రిక్కరణిన్ రహింతురని యేదియొ గుండియలో మెలంగెడున్

వారిని గాంచినప్పటికి వారిని జూచినయట్లె యొప్పెడిన్
వారిని మున్ను చూడకయ వల్లభమూర్తిని భూమిజాత
వ్వారిగ జూచినంతటన వల్లభమైన మనోoతరాంతర
స్ఫార మనోహరాకృతియు వచ్చి నిలంబడు గంటిముందరన్.

హనుమంతుడు లంకానగరంలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. పుష్పకంలో దేవతా స్త్రీల వంటి వారిని చూసాడు. తన యొక్క నిశితమైన పరిశీలనా దృష్టి, బుద్ధి విశేషం చేత అందరినీ గమనిస్తూ ముందుకుసాగుతున్నాడు.   పరీక్షా సమయంలో, అతని మనస్సు లోని ఊహలు ఇలా ఉన్నాయి.

" ఇంతకుముందే తెలిసి ఉన్నవారిని గుర్తుపట్టవచ్చు గాని, ఇంతకు ముందెప్పుడూ తెలియని వారిని గుర్తుపట్టడమెలాపోనీ, సీతాదేవి అసలు తెలియ దనుకొందామా, రామచంద్రమూర్తి ఇంత బాగా తెలిసిన వాడయినప్పుడు, సీతమ్మ తెలియదనటం కుదురుతుందా

ఒకరిని గురించి పూర్వ మెప్పుడో విని ఉన్నామనుకో. వారి గుణగణాలు కూడా బాగా ఇష్టమనుకో. కానీ, ప్రత్యక్షంగా వాళ్ళెట్లా ఉంటారో చూడలేదనుకోఅంతమాత్రాన ఏమయిపోయింది? మన మనస్సులో వాళ్ళను చూసినట్లే అనిపిస్తుంది. వాళ్ళు ఫలానా విధంగా ఉంటారనిమాట్లాడతారని, వ్యవహరిస్తారని ఏదో గుండె లోపల మెదులుతూ ఉంటుంది

తీరా వాళ్ళను చూసేటప్పటికి, అంతకు ముందెప్పుడూ చూడకపోయినా, వాళ్ళను చూసినట్లే అనిపిస్తుందిసీతమ్మ విషయంలో కూడా అంతే. ఆమెను ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడాఎక్కడో మనస్సు పొరల్లో ఇంతకుముందే  ఏర్పరచుకొన్న మనోజ్ఞ మంజులాకృతి వచ్చి కళ్ళముందు నిల్చున్నట్లుగా అనిపిస్తుంది. "

లోకంలో కొందరి యెడల ఇది జరుగుతూ ఉంటుంది. మనం ఇంతకు ముందెన్నడూ చూడనివారు తారసపడితే, ఇంతకుముందే వారిని చూసినట్లు, వారి రూపురేఖావిలాసాలు, గుణగణాలు, అన్నీ అంతకు ముందు మనం ఊహించుకొన్నట్లే ఉంటాయిదివ్యప్రకృతి గల వారి యెడల ఇది యదార్థమేమో !

హనుమంతుని  విషయ పరిశీలనకు అద్దం పట్టే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like