Wednesday 9 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 753 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)




ఏడో దైవము శాపదగ్ధుడయి తానీ భూమిఖండాన
మ్రాడూర్జస్వల లక్షణాంకితుడునై వ్రాలెన్ దివఃఖండమున్ 
వీడంబాఱి దృఢోరసుండు నయనావిర్భూత దివ్యార్చిషుం
డీడంబోయిన దేవతామహిమమై హ్రీతాత్మ తేజస్కుడై.

తన పాదధూళి తలఁ దా
ల్చెను బూర్వంబునను నిచటి క్షిత్తిమృత్తామృ
త్తును దానిపుడు తల దా
ల్చెను దేహం బెల్ల దానిచేఁ బిహితముగా.

  తాదృశ దుస్థితింబడియుఁ దా నయనంబున రాచఠీవియుం 
బోదు, ముఖాంబుజాతమునఁ బుట్టదు దైన్యము, దేహకాంతి
ర్యాదయుబాయ, దామరవనాంతర కల్పకశాఖ యొక్కడు
త్పాదిత ఝంఝచేఁ జెదరి వచ్చి ధరిత్రిని బడ్డయట్టులై

పరమేశ్వర నిర్మాల్యము
పురాణ సంతాన రమ్య పుష్పవ్రజమున్
ధరణిం ద్రోసిరొ యనగను
సురరాజసుతుండు వాలి క్షోణిం దోచెన్.

  ధరణిం దాకియుఁ బాతకాల కలితోద్యత్కాంతివారంబు వీ
సర బోకుండినయట్టిదౌ గగన నక్షత్రైక ఖండంబునాన్
బరమోదార విచిత్ర భాసుర మహఃపర్యాప్తదేహుండు ది
వ్యరమం బొల్చెన యశ్మకుట్టనవ్రతుండౌ యోగిచందంబునన్.

శ్రీరాముని యొక్క తీవ్రశరాఘాతానికి నేలగూలాడు వాలి సందర్భంలో విశ్వనాథ వ్రాసిన పద్యాలను చదివితే, వాలి పాత్రను విశ్వనాథ ఎంత మహోజ్జ్వలంగా తీర్చిదిద్దారో అర్థమౌతుంది.

" విశాలమైన వక్షస్థలంతో, కాంతిమయమైన కన్నులతో, మహాసామ్రాజ్యానికి చక్రవర్తియైనటువంటి  లక్షణాలు గల వాడొకడు, శాపగ్రస్తుడై, దైవత్వాన్ని, తేజస్సును  కోల్పోయి , లజ్జావిహీనుడై, స్వర్గలోకాన్ని విడిచిపెట్టి  యీ  భూమిఖండాన వ్రాలాడా అన్నట్లు నేలపై పడి ఉన్నాడు

ఇంతకుముందు ఇదే మట్టి తన పాదధూళిని తల దాల్చిందిఇప్పుడోశరీరమంతా దుమ్ము, ధూళి అంటుకోగా, తాను మట్టిలోనే తల వాల్చాడు

అటువంటి దయనీయమైన స్థితిలో ఉండి కూడా, ఆయన కళ్ళలో రాచఠీవి మాత్రం తగ్గలేదుముఖపద్మంలో దైన్యం కనపడటం లేదు. దేహకాంతి పోలేదు. పెనుగాలికి విరిగిన స్వర్లోక కల్పవృక్షం యొక్క కొమ్మ ఒకటి చెదిరివచ్చి భూమిపై పడ్డదా అన్నట్లు, వాలి నేల మీద పడి ఉన్నాడు

పరమేశ్వరుని పూజించిన పుష్పాలు నిర్మాల్యంగా మారినపుడు, భూమి మీద పారబోశారా అన్నట్లు, ఇంద్రతనయుడైన వాలి నేల మీద పడి ఉన్నాడు.

ఆకాశం నుండి ఊడిపడ్డ ఒక నక్షత్రఖండం, నేల మీద పడ్డ తరువాత కూడా దాని కాంతిని కోల్పోకుండినట్లు, పరమోదారమైన, విచిత్రమైన దేహకాంతి మరల తిరిగి వచ్చిందా అన్నట్లు, దివ్యమైన కళతో, రాతిని చెక్కే పనిలో నిమగ్నమైన ఉన్న ఒక యోగిపుంగవుని వలె వాలి నేల మీద పడి ఉన్నాడు. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోని యీ సన్నివేశాన్ని చదువుతుంటే పఠితల గుండెలు పిండివేసిన భావం కలిగి, ఒక మహాపరాక్రమశాలి, దైవాంశతో పుట్టిన వాడైన వాలికి ఇంతటి దుస్థితి తప్పలేదంటే, సామాన్యజీవుల గతేమిటన్న ప్రశ్న ఉదయించక మానదు.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like