Sunday 6 September 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 749 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)




హనుమ యితనిఁ గూర్చి యాశ్చర్యపడె నన్న
నబ్బురంబె కొల్వునందుఁ గాంచి
శైవరౌద్రదీప్తిసంయోగ మొలసిన
యట్లు తోచు నాహవార్థి యగుట.

కన్నుల కింత బిట్టుగను గన్పడు నీతని మూర్తి యింత తే
జున్నది యింత చేవ కల దుర్విని శక్తిగలాడు  కోర్కులం
దున్నెడి మంటిత్రోవబడి తూలునె? లేదటె మింటి త్రోవ? నే
నెన్నకమున్నె వింటిపయి కేగెడు మత్కరమో విభీషణా !

రామలక్ష్మణులు నాగపాశ బంధ విముక్తులవటం చూసి రావణుడు ఆశ్చర్యపోయాడురాముని గూర్చి సంశయం మళ్ళీ మెదడును తొలవటం మొదలుపెట్టింది. కలలో అతడికి మృతులైన రాక్షసవీరులు కనిపించి అతడి మనస్సును ఇంకా చీకాకు పరచటం మొదలుపెట్టారుచివరకు రావణుడే  రథారూఢుడై యుద్ధరంగానికి వెళ్ళాడు.

రావణుని చూడగానే రాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. మండే సూర్యుని  కిరణకాంతి నావరించి, మధ్య నున్నటువంటి నీలవర్ణం తిరిగివచ్చి రావణుని దేహాన్ని అలుముకొన్నదా అన్నట్లు, రావణుడు వెలిగిపోతున్నాడని రాము డనుకొన్నాడు. రావణు డింతటి తీక్షణమైన దేహకాంతి కలవాడని తన ఊహకు ఇంతకు ముందెన్నడూ తట్టలేదని తలపోశాడురాముడు రావణుడిని గూర్చి ఇంకా ఇలా అనుకొన్నాడు.

" హనుమ ఇతడిని కొలువుకూటంలో చూసి ఆశ్చర్యపోయాడంటే అబ్బుర మేముందియుద్ధసన్నద్ధుడై వచ్చాడు కనుక శివుని యొక్క  శుభకర తేజం, రౌద్రదీప్తి  మిళితమై అతనిలో కనిపిస్తున్నది.

కంటికి యింత స్పష్టంగా కనిపిస్తున్న ఇతని ఆకారం చాలా తీక్షణంగా, పరాక్రమోపేతంగా ఉంది. ఇంతటి శక్తి కలవాడు తుచ్ఛమైన కోరికల వెంటబడి మట్టి దారిలో పోవడమేమిటి? దివ్యమైనటువంటి ఆకాశమార్గం లేదావిభీషణా! నా చేయి అప్రయత్నంగానే ధనుస్సు మీదకు పోతున్నదోయీ ! "

రాముడు శైవం ఉట్టిపడుతున్న రావణుడిని చూసి మొదట ఆశ్చర్యపడినా, పిదప  తుచ్ఛమైన అతడి కామప్రవృత్తిని అసహ్యించుకున్నాడు.  " మంటి త్రోవ, మింటి త్రోవ " అన్న రాముని మాటలలో శరీరం అశాశ్వతమని, కోరికలను జయించటం అలౌకికమైన ఆనందాన్నిస్తుందని ధ్వనిస్తున్నదిఅందువల్లనే, ధర్మప్రతిష్ఠాపకుడయిన రాముని చేయి అప్రయత్నంగా వింటి పైకి వెళ్ళిందని అర్థం చేసుకోవాలి.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like