Wednesday 15 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 27. (పారిజాతాపహరణము)

పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు దీర్ప నె
ప్పాటను బాటు గామి మృదుపల్లవ కోమల తత్పదద్వయీ
పాటలకాంతి మౌలిమణిపంక్తికి వన్నియ వెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.

జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధుకన్నతండ్రి శిర మచ్చో వామపాదంబునం
దొలగం ద్రోచె లతాంగి యట్ల యగు నాథు ల్నేరము ల్సేయ బే
రలుకం జెందినయట్టి కాంత లుచిత వ్యాపారము ల్నేర్తురే?

రెండు ప్రసిద్ధమైన పద్యాలు నంది తిమ్మన గారి పారిజాతాపహరణము ప్రథమాశ్వాసము లోనివి.

శ్రీకృష్ణుడు రుక్మిణీ గృహంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి మహిమాన్వితమైన పారిజాత పుష్పాన్ని దేవదేవునకిస్తాడుదానిని తనకు అత్యంత ప్రియమైన భార్యకు ఇవ్వవలసినదంటాడు పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడుచెలికత్తె ద్వారా యీ విషయము తెలిసికొన్న సత్యభామ కోపగృహాన్ని చేరి అలుక బూనుతుందిసత్యభామ దగ్గరకు వచ్చిన   జగన్నాటకసూత్రధారి, విధంగానూ ఆమె కోపాన్ని ఉపశమింప చేయలేక, చిగురుటాకు కంటె మెత్తనైన ఆమె ఎఱ్ఱని పాదములు, తాను ధరించిన కిరీటమునందలి మణుల కాంతిని ఇనుమడింపజేయునన్నట్లుగా, శిరస్సును వంచి  నమస్కరించాడు.

అప్పుడు అసలే కోపంతో ఉన్న సత్యభామ ఏం చేసిందిఆమె పాదములపై నున్న భర్త శిరస్సును తన ఎడమ కాలితో ప్రక్కకు తీసింది (తొలగం ద్రోచె).  అబ్బ! మంచి పని చేసిందిలే అంటున్నాడు కవిఎందుకనిమరి శిరస్సు మామూలు శిరస్సాజలజాతాసనుడు (బ్రహ్మ), వాసవుడు (ఇంద్రుడు) మొదలుగా గల దేవతల చేత పూజ లందుకొనే, లతాంతాయుధు (మన్మథుని) కన్నతండ్రి, విష్ణువు (కృష్ణుని) యొక్క శిరము.

చివరగా ఎట్లా సమన్వయము చేశాడు కవి?  " నాథు ల్నేరము ల్సేయ పేరలుకం  జెందిన కాంత లుచిత వ్యాపారము ల్నేర్తురే? ".

అవునుతన భర్త చేసిన ఇంత నేరమునకు, సత్యభామ మంచి పనే చేసింది. సర్వ దేవతల పూజ లందుకొనే శిరస్సు, పారిజాత పుష్పము ఇవ్వలేదని, సపత్నుల ముందు తనను చిన్నబుచ్చాడని, ఏదో  అలిగిందే అనుకోఆమె పాదాలకు జగన్నాటకసూత్రధారి  మ్రొక్కుతాడా?   మానవతియైన సత్యభామ దానిని సహించగలదాఅందుకని, భర్త చేసిన పని ఆమెకు నచ్చక తొలగ ద్రోసింది.

కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంత చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు తమ " సాహిత్య సురభి " లో.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like