Tuesday 7 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 14.(వసుచరిత్రము అవతారిక)

మందాకిని మౌళి బూని నను నర్ధాంగీకృతం జేసి తౌ
నౌ మేల్మేలని యార్య యల్గ బ్రణతుండై తద్పదాంభోజ యో
గామర్షంబున గంగయు న్మొరయ జూడాభోగ సమ్యక్రియా
సామర్థ్యంబున వేడు శంభుడు కృతిస్వామిన్ కృపం బ్రోవుతన్.

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో భట్టుమూర్తి అని ప్రసిద్ధి గాంచిన రామరాజభూషణుని వసుచరిత్రము ఒక అనర్ఘరత్నము, అత్యద్బుతమైన సృష్టి కావ్యం ఒక  సంగీత సాహిత్యముల మేళవింపుకావ్యము చాలవరకు శ్లేషార్థ సమన్వితమై భావుకులను రంజింప జేస్తుంది

పై పద్యం వసుచరిత్రము అవతారికలో శివుణ్ణి స్తుతిస్తూ చెప్పిందిపద్యంలో  గంగా పార్వతుల పరంగా  వాడిన పదాలు  పద్యాన్ని చమత్కారభరితం చేయడమే గాక, పద్యానికి శోభను చేకూర్చాయిచూడండి.

శివుని జటావనులలో బంధింపబడిన గంగ, పార్వతికి సవతి  అని  కవులందరూ చమత్కారంగా చెప్పే మాటముసలిదైన మందాకినిని (గంగను) నెత్తికెక్కించుకొని, పదహారేళ్ళ పడుచుదాననైన తనకు అర్థశరీరం మాత్రమే ఇచ్చాడని ఆర్య (పార్వతి) కినుక వహించిందటమందాకినికి రెండు అర్థాలున్నాయి. ఒకటి గంగానది రెండవది ముదుసలిది అనిఅట్లాగే, ఆర్య అంటే పార్వతి అని పదునారేండ్ల వయస్సు కలిగినది అనిఅందుకని, పార్వతి కోపం పోగొట్టడానికి శివుడు ఆమెకు ప్రణమిల్లాడటఅప్పుడు, నెత్తి మీద నున్న గంగ మొరబెట్టినదట, అంటే కదలబారి ధ్వని చేసింది. తన అయిష్టతను తెలియజెప్పింది.   కానీ, ఇద్దరు భార్యల ముద్దుల మగడైన శివుడు బహు నేర్పరి గదాఅందుకనిచెదరిన తన జడలను సవరించుకొనే నెపంతో గంగను ఓదార్చాడట. అటువంటి " చూడాభోగ సమ్యక్రియా సామర్థ్యము " (చెదరిన జడలను సవరించుకొనెడి నేర్పు కలిగిన) శంభుడు కృతిపతిని రక్షించుగాక అని ఆశీర్వచనము.


ఇప్పుడు మళ్ళీ పద్యాన్ని చదవండికావ్యానందం అంటే ఏమిటో తెలుస్తుంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like