Thursday 9 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 20 (వసుచరిత్రము)

ఇచ్చ హితాహితంబు గణియింపని గోలవు గాన గానకున్ 
వచ్చితి గా కయో పథికవర్గము నొంటి జరింప నిచ్చునే
యిచ్చటి అన్యపుష్టచయ మిచ్చటి మత్తమధువ్రజం
బిచ్చటి పల్లవోత్కరము లిచ్చటి పాంసులపంకజావళుల్.

పద్యము రామరాజభూషణుని వసుచరిత్రము లోనిదికావ్యము మొత్తంలో కూడా శ్లేష ఉన్నట్లే, పద్యం కూడా శ్లేషాన్వితమై ఉంటుంది. చూడండి.

వసురాజుమీది విరహముతో, వనంలో ఒంటరిగా తిరుగుతున్న గిరికతో, ఆమె చెలికత్తెలు యీ విధంగా అంటున్నారు.

" అయ్యో! నీ మనస్సులో నీకేది ఇష్టమో, ఏది అనిష్టమో ఎంచుకొనలేని ముద్దరాలవు, యీ విధముగా అడవిలోనికి వస్తే, ఇక్కడ ఉండే కోకిలల సమూహం, పూదేనె కోసం వెంపరలాడే తుమ్మెదలగుంపు, వనంలోని చిగురుటాకుల గుంపు, ఇక్కడ పుప్పొడితో అంటుకొనియున్న పద్మదళాలు, మొదలైన వాని వలన విరహిణివైన నీకు ఇబ్బంది కలుగుతుంది కదా!

పద్యంలో ఇంకొక విశేషం ఉంది. ప్రస్తుత సమాజంలో, చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలకు అద్దం పడుతుందీ పద్యంభట్టుమూర్తి కాలంలో కూడా సమాజం భిన్నంగా ఉందని అనుకొనడానికి వీలులేదుకాకపోతే, తీవ్రతలో తేడా ఉండవచ్చుకాబట్టి, మనిషి మనీషి అవ్వాలంటే, పశువుల లోని (జీవులు) పశుత్వం నశించిపశుపతి (దేవుడు) పైకి రావాలి

ఇక రెండవ అర్థము

"అయ్యో, నీవెంతటి అమాయకురాలివో కదా! నీకేది మంచిదో, యేది మంచిది కాదో కూడా తెలుకొనలేకపోతున్నావు. వనంలో (లోకంలో),  తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో లేకుండా, ఇష్టారాజ్యంగా తిరిగే ధూర్తులు, ఆకతాయిలు (అన్యపుష్టచయము), మద్యపానప్రియులు(మత్తమధువ్రతవ్రజంబు), వేశ్యాలోలులు (పల్లవోత్కరము),  దుష్టబుద్ధి కల పాపాత్ములు (పాంసులపంకజావళుల్ ), నిన్ను ఒంటరిగా, స్వేచ్ఛగా తిరుగనిస్తారా? "  అంటే ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగితే బ్రతుకనిస్తారా అని అర్థము

 ఒక విషయము. శ్రీ అరవిందులవారి " టైగర్ అండ్ డీర్ " అనే పద్యం గుర్తుకొస్తుంది సందర్భంలో.

అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఒక జింకపిల్ల, సెలయేటిలో నీరు త్రాగుతుంటుందిఒక పెద్దపులి, మెల్లగా అడులో అడుగు వేసుకుంటూ వచ్చి, జింకపిల్లను చంపుతుందిఅడవిలో జరిగే యీ మూగజీవుల మారణహోమం, మానవసమాజంలో జరిగే అకృత్యాలకు అద్దం పడుతుందిఅయితే అరవిందులవారుఎప్పటికైనా జింకపిల్ల అడవిలో స్వేచ్ఛగా తిరిగే రోజొస్తుందంటారుఅది జరగాలంటే, జింకలన్నీ పులిపై తిరగబడాలి, లేదా, పులి క్రూరత్వం తగ్గి, జింకకు కూడా అడవిలో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఊందనే, మానసిక పరివర్తన కలగాలిజింకపిల్ల అణగారిన, పేద, బలహీన వర్గాలకు ప్రతీక కాగా, పెద్దపులి నియంతృత్వ, నిరంకుశ, ధనిక, బలవంతుల వర్గానికి ప్రతినిధి. ఆశావాదియైన శ్రీ అరవిందులు యీ రెండవ మార్గమైన మానసిక పరివర్తనను అభిలషించారుఅది జరగాలంటే, సమాజంలో భాగమైన ప్రతి వ్యక్తికీ, తన సంస్కృతీ ధర్మాలపైన అచంచలమైన విశ్వాసం కలిగియుండి, ధర్మాన్ని ఆచరించాలిపరిపూర్ణయోగాన్ని లోకంలో వ్యాప్తి జేసిన శ్రీ అరవిందయోగి ఆశయము  ఫలించు గాక!


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like