Tuesday 7 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 16 (పాండురంగ మాహాత్మ్యము)

ప్రామినుకులదొంగ బాతాళకుహరంబు
          జొరబాఱి చీఱినచోఱ వీవ
తరిగొండ వెన్నుపై దాల్చి వేల్పుల గూటి
          చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ
నీటిలో మునిగిన నేల చేడియ గొమ్ము
          కొన  నుబ్బ నెత్తిన ఘోణి వీవ
మునిమాపు బలుగంబమున బుట్టి బట్టు
          క్కఱను గాచినట్టి సింగంబ వీవ
దితిజు మెట్టిన యా పొట్టిదిట్ట వీవ
పుడమిఱేడుల నడచిన ప్రోడ వీవ
కడలి గోలకు దెచ్చిన గబ్బి వీవ
యిపుడు ద్వారక వసియించునీవు నీవ

దశావతార వర్ణనలలో శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ చెప్పిన పద్యాలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయిఒక్కొక్క మహాకవి చెప్పిన తీరు ఒక్కొక్క విధంగా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందిఅటువంటిదే, నంది తిమ్మన గారి పారిజాతాపహరణములో, నారదుడు చేసిన యీ శ్రీకృష్ణ స్తవం.

పద్యంలో, మీనావతారం మొదలుకృష్ణావతారం వరకు వర్ణింపబడిన శ్రీమహావిష్ణువు అవతారములు, అచ్చ తెలుగులో చెప్పబడ్డాయిఅదీ, యీ పద్యం అందం

ప్రామినుకులంటే వేదములువాటిని దొంగిలించి పాతాళంలో దాచడం ఇవన్నీ మత్స్యావతార విశేషాలుతరిగొండ మంథర పర్వతము. దానిని వీపుపై దాల్చి దేవతల కూటి చవి ( ఆహారరుచి - అమృతపానము) తీర్చినది ఆదికూర్మమునీటిలో మునిగిన నేలచేడియను (భూదేవిని) ఉద్ధరించినది వరాహరూపుడైన విష్ణువుమాపు అంటే రాత్రి. మునిమాపు అంటే రాత్రికి ముందు, సాయంకాలముఆసమయంలో స్తంభము  నుండి వెలువడి హిరణ్యకశిపుణ్ణి చంపింది నృసింహమూర్తిబలి చక్రవర్తిని పాతాళానికి మెట్టిన (అణగదొక్కిన) పొట్టిదిట్ట వామనుడుపుడమిఱేడుల నడచిన ప్రోడ పరశురాముడుకడలి గోలకు దెచ్చిన గబ్బి (బాణాన్ని సంధించిన వీరుడు) రాముడుఇక తేటగీతిలోని " యిపుడు ద్వారక వసియించు నీవు నీవ "   అందము గురించి ఏమని చెప్పాలివిశ్వనాథవారు చెళ్ళపిళ్ళ వారి గురించి " తన శిష్యులన్న యెడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన " వంటిదే యిది " నీవు నీవ " అనేది, శ్రీకృష్ణుని యొక్క దశావతారాలకు భిన్నమైన, పరిపూర్ణ తత్వాన్ని, సర్వాంతర్యామిత్వ, సర్వవ్యాపకత్వాన్ని స్పృశిస్తుంది.


ఇటువంటి పద్యాలను తదేకాయత్త చిత్తంతో రోజూ మననం చేస్తే, అవి మంత్రాలై కూర్చోవా?

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like