Monday 13 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 22 (ఆంధ్రమహాభారతావతారిక)

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో   వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహ న్యవిహతాం స్త్రీపుంసయోగోధ్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా స్సురై 
ర్భూయాస్సుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే.

శ్రీమదాంధ్ర మహాభారతము తెలుగులో రచించడానికి నాంది పలికింది ఆదికవి నన్నయఆదిపర్వము, ప్రధమాశ్వాసములోని శ్లోకము మంగళశ్లోకముకావ్యారంభంలో ఆశీర్వచనం కానీ, నమస్కారం కానీవస్తునిర్దేశం గానీ ఉండాలనేది లాక్షణికుల నిర్దేశందాన్ని అనుసరించి నన్నయ , ఆశీర్వచనాన్ని దేవభాషయైన సంస్కృతంలో చేసి, కావ్య రచనకు ఉపక్రమించారు.

విష్ణు బ్రహ్మ మహేశ్వరులు క్రమంగా    లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలంలోను, ముఖంలోను, శరీరంలోను ధరించి, స్త్రీపురుష సంయోగ ఫలితమైన యీ జగత్తును సుస్థిరంగా, అవిచ్ఛిన్నంగా పాలిస్తున్నారో, వేదమూర్తులైన, పూజనీయులైన అట్టి త్రిమూర్తులు మీకు శుభమును కలిగించు గాక అని యీ శ్లోకము భావము.

నన్నయ ఋషి.  " ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి " అన్నారు విశ్వనాథఅందువలననే, లోకంలో అలవాటుగా ఉన్న సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే క్రమంలో కాకుండా, నారాయణ శబ్దభవుడైన నన్నయ, కవిబ్రహ్మ వాచ్యుడైన తిక్కన, ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱనలచే మహాభారత రచన పరిసమాప్తి అవుతుందనే అర్థం స్ఫురించేటట్లు, త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ మహేశ్వరులనే క్రమమే ఆయన నోటివెంట ఋషివాక్కుగా వెలువడిందిఅంతేగాక, త్రిమూర్తులు  సనాతన దాంపత్య జీవనానికి ప్రతీకలుఅందువల్లనే, స్త్రీపుంసయోగోద్భవమైన లోకాన్ని అవిచ్ఛిన్నంగా సాగించారని విష్ణు బ్రహ్మ మహేశ్వరులను, వారి దేవేరులను పేర్కొనడము జరిగింది.


ఇన్ని విశేషాలు ఉండడం వల్ల యీ శ్లోకము, ఇన్ని శతాబ్దాలు గడచినా  రసజ్ఞుల హృదయాల్లో  చెక్కు చెదరకుండా  ఉంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like