Friday 10 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 21. (మనుచరిత్రము అవతారిక)

ఉల్లమునందు నక్కటికమూనుట నీకులమందు గంటిమం
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేతనవ్వు సం
ధిల్ల గిరీటి బాశుపత దివ్యశరాఢ్యుని జేయు శాంబరీ
భిల్లుడు గృష్ణరాయల కభీష్టశుభప్రతిపాది గావుతన్.

మహాకవుల కావ్యావతారికలలో కొన్ని పద్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరనట్లే ఉంటాయి. అవి ఇష్టదేవతా ప్రార్థన పద్యాలయితే, ఇక చెప్పే పనేముంది పద్యాల కోవకు చెందిన పెద్దన గారి మనుచరిత్రము పీఠిక లోని యీ పద్యాన్ని పరిశీలిద్దాం.

అరణ్యవాసకాలంలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేశాడుఅతని తపోదీక్షను పరీక్షించడానికై శివుడు కిరాతరాజు వేషంలో వచ్చి, క్రీడార్థంగా అర్జునుడితో  పోరాడి, ఓడినట్లు నటించాడు.   సందర్భాన్ని పురస్కరించుకొని " మీ కులంలో ఎప్పుడూ లేని జాలి కనిపించిందే! " అని ఛలోక్తులు విసరింది పార్వతి పరిహాసోక్తులకు చిరునవ్వు నవ్వి అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన శివుడు కృష్ణరాయలకు అభీష్టసిద్ధి కలిగించుగాక అని ఆశీర్వచనము పలికాడు పెద్దన పై పద్యంలో.

పరిహాసమాడిన పార్వతి పరంగా ' అచలాత్మజ ' అని వాడటము, హాసముతో   దయాశాలియైన శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునునకు ఇచ్చాడనడము, ఎంతో భావయుక్తంగా, సముచితముగా ఉందిపరిహాసమాడిన  పార్వతి అచలాత్మజ కావున, భక్తుల భావపథ విహారియైన శివుని హాసాన్ని, మనోగతాన్ని అర్థం చేసుకోగలిగింది.

జాలి , ప్రేమ కలిగియుండడమనేది ఉత్తముల లక్షణం.    శివుడు జగత్తు మీద అమితమైన ప్రేమ గల అర్జునునకు పాశుపతాన్ని ఇచ్చాడు గానీ అయోగ్యులకు గాదుసర్వ జగత్తును క్షణకాలంలో భస్మీపటలం చేయగల పాశుపతాస్త్రాన్ని అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో వాడలేదుఅదీ, నరునకు నరజాతిపై గల ప్రేమ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే కవిసమ్రాట్టులు " గుప్తపాశుపతము (దాచియుంచిన లేక ఉపయోగించని పాశుపతము) " అనే నాటకాన్ని జాతికందించారు.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like