Thursday 26 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 5.(కుమారసంభవము)

జ్ఞానస్వరూపమై సర్వాత్ము డున్న దా
      జ్ఞేయస్వరూపమై నెఱసియుండు
బురుషస్వరూపమై పరమేశుడున్న దా
      బ్రకృతిస్వరూపమై పరగుచుండు
సూక్ష్మస్వరూపమై శుద్ధాత్ముడున్న దా
      స్థూలస్వరూపమై తోచియుండు 
నర్థస్వరూపమై యమలాత్ముడున్న  దా
      శబ్దస్వరూపమై జరుగుచుండు

హరుడు రుద్ర రూపమై యున్న దా నుమా
మూర్తి దాల్చి లోకములకు హితము
సేయుచుండు గాన శివశక్తి భేదంబు 
తెఱగు నీకు జడున కెఱుగ లావె

పద్యము నన్నెచోడ మహాకవి రచించిన కుమారసంభవము కావ్యము సప్తమాశ్వాసము లోనిదికపట వటువు రూపములోవచ్చిన శివుడు ,  "శ్మశానవాసియైన శివుని  వరించితపస్సు చేయడము తగదని " నిందావాక్యములుపలుకగా,    మాయావటువు నుద్దేశించి, పార్వతి చెలికత్తెలు, శివశక్తుల తత్వాన్ని తెలియజేయడము యీ పద్యం యొక్క విశేషము.

సర్వాత్ముడైన శివుడు జ్ఞానస్వరూపుడై యుండగ, పార్వతి జ్ఞేయస్వరూపమై ఉంటుందిజ్ఞేయమనగా తెలియదగినదిపురుషస్వరూపమై శివు డుండగా, ప్రకృతి స్వరూపమై పార్వతి వెలుగొందుతుందిశుద్ధాత్ముడైన శివుడు సూక్ష్మస్వరూపుడై యుండగా, పార్వతి స్థూలస్వరూపమై తోచియుంటుందిశివుడు అర్థస్వరూపమై యుండగా, పార్వతి శబ్దస్వరూపమై యుంటుందిశివుడు రుద్ర రూపమై యుండగా, పార్వతి ఉమాదేవి రూపాన్ని దాల్చి లోకానికి హితాన్ని చేకూరుస్తుందిమందబుద్ధులకు శివశక్తుల అవినాభావ స్థితి అర్థం కాదు.

దక్షయజ్ఞ విధ్వంసము కథ యీ విషయాన్నే మనకు తెలియజేస్తుంది. తెలిసి తెలిసీ సతీదేవి దక్షుని యాగశాలకు వెళ్ళడం, దక్షునికి శివశక్తుల అభేదాన్ని తెలియజేయడము కోసమే. శివుని తూలనాడిన తన తండ్రి దక్షుని కూతురు, దాక్షాయణిగా జీవించడానికి  మనస్కరించకతనువు చాలించిందితద్వారా, శివుని యందలి రుద్రాంశను మేల్కొల్పి, దక్షుని అహంకారాన్ని రూపుమాపి, ఉమాదేవిగా లోక హితాన్ని చేకూర్చింది

సీసపద్యం లో శివునికి, పార్వతికి వాడిన విశేషణాలన్నీ శివశక్తుల అభేదాన్ని సూచిస్తాయి. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో (  " శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్త: ప్రభవితుం " ) - శంకరులు యీ విషయాన్నే   ప్రస్తావించారుకాళిదాసు  "వాగర్థా వివ సంపృక్తౌ" అనే శ్లోకము  ఇక్కడ గుర్తుచేసుకోదగింది.

విశ్వనాథవారు తమ రామాయణ కల్పవృక్షములో  పలుతావుల, మహేశ్వరియైన సీతకు, పరమేశ్వరుడైన రామునికి గల అవినాభావస్థితిని, సీతామహాదేవి మాటల ద్వారా తెలియజేస్తారు.

పతియు జలంబు నేనును బ్రవాహము, రాఘవు డాకసంబు నే
నత మృదుగీతి, నింద్రుడగు నాయన నేను హవిస్సు, నాతడున్ 
శృతియు స్వరంబు నేను, రఘుశూరుడు  రసమూర్తి స్థాయి నే
నతనికి నాకునైన అవినాస్థితి దుస్థితి పొంద దెప్పుడున్.


పైన వివరించిన అంశాలన్నీ శివునితో శివానికి గల అవినాస్థితిని తెలియజేయడమే గాక, పరమేశ్వరి యొక్క ప్రేరణా శక్తిని కూడా విదితము చేస్తున్నాయి.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like