Wednesday 25 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 4. (పాండురంగ మాహాత్మ్యము)

పొదలు నీ పొక్కిటి పువ్వు కాన్పున కదా
      పెను మాయ పిల్లల బెట్టుటెల్ల
బొడము నీ మొదలి యూర్పుల నేర్పులన గదా
      చదువు సంధ్యలు గల్గి జగము మనుట
కెరలు నీ యడుగుదామరల తేనియకదా
      పాపంపు పెనురొంపి పలుచనగుట 
పొసగు నీ తెలిచూపు పస గదా యిది  రాత్రి
      యిది పగలను పేర నెరుగ బడుట

భవన ఘటనకు మొదలి కంబమును బోలె
భువములకెల్ల నీ వాదిభూతుడగుట
నిట్ట నిలుచున్కిచే గాదె నెట్టుకొనియె
గెంటుగంటును లేక లక్ష్మీకళత్ర

పద్యం  చదువుతుంటే తెలుగువారిగా పుట్టి మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ననిపిస్తుందిఎంత చక్కని పద్యంతేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, ఏరులా , సెలయేరులా........అన్న సినీగీతాన్ని గుర్తు చేస్తూ , "ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో అద్దితివేమొ గంటము మహాకవిశేఖర" అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పోతన గురించి వ్రాసిన పద్యము స్మృతిపథంలో మెదుల్తూతెనాలి రామకృష్ణకవి, తన పాండురంగ మాహాత్మ్యములోని యీ పద్యంలో ఎంత చక్కని తెలుగు పదాలతో అర్థగాంభీర్యాన్ని ప్రదర్శించారు.   అనిపిస్తుంది. అందుకనే కాబోలు "తగ సంస్కృతము దెనుంగుగ జేయగ, దెనుగు సంస్కృతము జేయంగ చతురమతివి" అని మెప్పు పొందాడు.

ఇక యీ పద్య విశేషాలకు వస్తే, పుండరీకుని భక్తికి మెచ్చి  అతని యెదుట ప్రత్యక్షమైన కృష్ణుని స్తుతిస్తూ చెప్పిన పద్యం ఇది.

పొక్కిలి అంటే బొడ్డు పొక్కిటి పువ్వు విరిసి పురుడు పోసుకొన్నదటదానికి పెనుమాయ పుట్టి, పిల్లలు పెట్టి వృద్ధి పొందినదటపెనుమాయ బ్రహ్మ.   బ్రహ్మ యీ జగత్తును సృష్టించడం పొక్కిటి పువ్వు   కాన్పువల్ల.   కావ్యరసాభిలాషులకు ఒళ్ళు పులకరించి పోదూ!

ఇక రెండవ పాదములో చూడండి. పరమపురుషుడు తీసిన నిట్టూర్పుల (ఉఛ్వాసనిశ్వాసములు) వలన, ప్రపంచానికి చదువుసంధ్యలు అబ్బినాయట. భగవంతుని ఉఛ్వాసనిశ్వాసాలే వేదాలు. అవే మనకు తొలిచదువులు, ప్రామాణికాలు, జాతి మనుగడను నిర్దేశించేవి.

స్వామి అడుగుతామరల తేనియ, అంటే, విష్ణు పాదపద్మోద్భవయైన పవిత్ర గంగా నది. గంగానది భూమిజనుల పాపాలనే బురదను కొంచెమయినా పలుచగా చేస్తున్నదటకలియుగంలో పాపాలను పూర్తిగా కడిగివేయడం సాధ్యం గాదు.  

స్వామి తెలిచూపు అంటే తేటయైన చూపు. స్వామి తేరిచూడడం వల్ల మనకు పగలు, రాత్రి అనే మార్పు తెలుస్తున్నదిసూర్యచంద్రులు భగవంతుని నేత్రాలుఇది చాలా వింతైన  మాట. ఇది పగలు, ఇది రాత్రి అని మనం తెలుకొనగలగడం ఆయన తేరిచూడడం వల్లమన తెలివితేటల వల్ల  కాదు. " పొసగు నీ తెలిచూపు పస గదా ఇది రాత్రి ఇది పగలని నెరుగబడుట" .   రెండు భావాల మధ్య అతుకబడిన యీ పస  గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలితెలుగు వారికే స్వతమయింది యీ పసఏమి యీ మహానుభావులు! తలచుకొంటేనే మనసు పులకరించి పోతున్నది.

బ్రహ్మాండ భాండము ఒడిదుడుకులు లేకుండా, స్తంభము వలె నిలబడడానికి కారణము ఆదిపురుషుడేఅంటే, యీ సృష్టికి మూలకారణము అతడేఇదీ, యీ పద్యము యొక్క భావము.

పొక్కిటి పువ్వు కాన్పు , పెనుమాయ పిల్లలు బెట్టుట, మొదలి యూర్పుల నేర్పులు, అడుగుదామర తేనియ, పాపంపు పెనురొంపి, తెలిచూపు పస ........అహోఏమి యీ పాండురంగవిభుని పదగుంఫనతెలుగుజాతి ధన్యత నొందింది

తెనాలి రామకృష్ణ కవి  రచించిన పాండురంగ మాహాత్మ్యము కావ్యమునకు పామర వ్యాఖ్యానము అను పేర చక్కని టీక, తాత్పర్యము, విశేష వ్యాఖ్యను డా. డి.ఎస్.గణపతి రావు గారు అందించినారువారికి కృతజ్ఞతాంజలులు సమర్పించుచున్నాను.

.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like