Monday 23 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 1. (కుమారసంభవము)

ఇప్పటినుండి బ్లాగులో మీ ముందుంచే పద్యాలకు "సువర్ణ సుమన సుజ్ఞేయము" అనే పేరు పెట్టడము జరిగింది. పదబంధము తెలుగువారి పుణ్యపేటియైన పోతనగారి భాగవతము లోనిదితెలుగువారికి, పద్యాలకు విడదీయరాని బంధము. అవి సుందరోద్యానవనంలో విరబూసిన పలు  రంగుల (సువర్ణఅందమైన  పువ్వులు (పద్యములు).  అందువల్ల, అవి సుజనుల మనస్సులను సుజ్ఞేయము (సువిదితము) చేస్తాయనడంలో అబ్బురమేముంది

పని జేయడానికి భాషాభిమానమే కారణము గానీ, నాకు భాష మీద కావలసినంత అధికారము (పట్టు ) లేదని సవినయముగా విన్నవించుకుంటున్నాను.   సగటు సాహిత్యాభిమానికి దగ్గరవడానికి ఇంత మాత్రపు భాష మీద మక్కువ, చొరవ చాలుననే విశ్వాసంతో పనికి పూనుకున్నాను. శరీరము, మనస్సు సహకరిస్తే, మంచి పద్యాలను మీతో పంచుకొని, కాలమయుడైన భగవంతుడు ప్రసాదించిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.   ఇక చదువుదాము::

కర మవిచారి, తద్దయు వికారి మనం, బది సారివోలెనే
తిరిగెడు గాని నిల్వదెట, దీని జలత్వము మాన్చి నీ పదాం
బురుహములంద సంస్మరణము బొంద దయన్ సురబృందవంద్య
సుస్థిరముగ నిల్పు తత్వవిధి దెల్పు సమస్థితి సల్పు! శంకరా

పద్యము నన్నెచోడకృత కుమారసంభవ కావ్యము లోనిది. పర్వతరాజ పుత్రి పార్వతి, శివుని పతిగా పొందగోరి కఠోరమైన తపమాచరించింది. సమయంలో శివుని గూర్చి విధంగా తలపోసింది:

"పరమేశ్వరా! మనస్సనేది సరియైన ఆలోచనలు చేయలేనిది; పలు వికారములకు లోనయ్యేదిఅది కుమ్మరివాని చక్రం లాగా నిలకడ లేక తిరుగుతూనే ఉంటుందినీవు దయతో దీని నిలకడలేనితనాన్ని మాన్పి, నీ పదపద్మాల యందు దృష్టి నిలిచేటట్లుగా, నీ తత్వము తెలిసేటట్లుగా, సమత్వము కలిగేటట్లుగా అనుగ్రహించు." 

ఇటువంటి భావాన్నే, ధూర్జటి మహాకవి తన కాళహస్తీశ్వర శతకములో వెలువరించాడు.

 " శ్రీ విద్యుత్కలితాజవంజవ మహా జీమూతపాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! మీ కరుణా శరత్సమయ మింతే జాలు చి
ద్భావనాసేవం తామరతంపరై నిలచెదన్ శ్రీకాళహస్తీశ్వరా!"

సంసారనేది ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘాలు, ఎడతెరిపి లేని వర్షధారలతో కూడుకున్న వర్షాకాలము వంటిదిఅంటే, బంధనాలతో కూడుకున్నది సంసారము. వర్షకాలములో సరోవరములోని పద్మాలు తమ నిగారింపు కోల్పొయినట్లే, నా మనస్సనే పద్మము కూడా సం యమనము కొల్పోయింది. అందువల్ల, పరమేశ్వరా! వర్ష ఋతువు దాటిన తరువాత, శరదృతువు విధంగా సూర్యకిరణాలను ప్రసరింప జేసి, మరల పద్మాలను వికసింప చేస్తుందో, నీ దయ అనే చల్లని వెన్నెలను నాపై కురిపించి, నన్ను చిద్భావనలో ( జ్ఞాన మార్గములో) నడిపించుఅప్పుడు, నా మనుగడ తామరతంపరగా (పరంపరాభివృద్ధిగా) విలసిల్లుతుంది.

ఇటువంటి పద్యాలను మననం చేస్తూ , దైనందిన జీవితములో ఆచరించి సంయమనాన్ని సమత్వాన్ని పాటిస్తే, జీవితము ఆనందమయమవుతుంది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like